హాం ఫట్ అంటూ మింగేస్తున్న తెలుగుదేశం నాయకులు
- రెవెన్యూ రికార్డుల్లో డొల్లతనం
- క్షేత్రస్థాయి అధికారులు ఎవరి పేరు రాస్తే వారిదే భూమి
- పక్కాగా భూములను సొంతం చేసుకుంటున్న అధికార పార్టీ నేతలు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో భూమి ఎవరిదో ప్రభుత్వానికే తెలియటం లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. వందలాది గ్రామాల్లో వేలాది సర్వే నంబర్లలోని లక్షలాది ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులదా? ప్రభుత్వానిదా? దేవాదాయ శాఖదా? అనే అంశంపై రెవెన్యూ శాఖకే స్పష్టత లేదు. భూ యాజమాన్య రికార్డు (1-బి) లోనూ, భూ అనుభవ రికార్డు (అడంగల్) లోనూ సర్వే నంబర్ల వారీగా భూముల విస్తీర్ణం కాలమ్ పక్కనే యజమాని పేరు ఉండాలి. అయితే, రాష్ట్ర రెవెన్యూ రికార్డుల్లో లక్షలాది సర్వే నంబర్ల ఎదుట భూ యజమాని కాలమ్లో తెలియదు (అన్నోన్) అని రాసి ఉంది. ప్రభుత్వ పెద్దలు గొప్పగా చెప్పుకుంటున్న `మీ - భూమి వెబ్ సైట్` లోనూ ఈ విషయం తేటతెల్లమవుతుంది. `
టీడీపీ నేతల దందా
`ఎవరిదో తెలియదు` అని రెవెన్యూ రికార్డుల్లో ఉండి, ఖాళీగా ఉన్న భూములను అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకుంటున్నారు. భూమి తమ ఆధీనంలో ఉన్నందున 1-బి, అడంగల్ తదితర రికార్డుల్లో తమ పేరు చేర్చాలని రెవెన్యూ సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు దీంతో ఇప్పటికే పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు అధికార పార్టీ నేతల సొంతమయ్యాయి. ఆ మేరకు రెవెన్యూ రికార్డుల్లోనూ, మీ - భూమి వెబ్సైట్లోనూ మార్పులు జరిగిపోయాయి. `తెలియదు` విభాగంలోని మిగిలిన ప్రభుత్వ భూములనైనా పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు