అవినీతి పాలనకు చెంపపెట్టు

7 Nov, 2017 17:11 IST
అసెంబ్లీ బహిష్కరణ రాజకీయాల్లో సాధారణంగా వినిపించే మాట. అయితే అధికార పక్ష అన్యాయ వైఖరిని నిరసించేందుకు ప్రతిపక్ష నేతలు అసెంబ్లీని బహిష్కరించడం సాధారణ విషయమే. అయితే 2017లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే పూర్తి ప్రతిపక్షం అంతా కలిసి అసెంబ్లీలో అడుగుపెట్టకూడదని తీర్మానించుకోవడమే అందుకు కారణం. 

ప్రతిపక్షం అంటే అధికారపక్షం చేసే తప్పులను ఎత్తి చూపేది. ప్రభుత్వం చేసే పాలనాపరమైన, శాసన పరమైన, ప్రజాసంబంధమైన నిరంకుశ నిర్ణయాలను ప్రశ్నించేది. అధికార దుర్వినియోగంతో ప్రజా సంక్షేమాన్ని పక్కనపెడితే, ప్రజల పక్షాన నిలిచి పోరాడేది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థ ఇప్పుడు అచ్చం అలాగే తయారయ్యింది. దుర్మార్గమైన టిడిపి పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. రాజకీయాల్లో విలువలు దిగజారిపోయాయి. ప్రజా సంక్షేమం పేరుకు కూడా లేకుండా పోయింది. అక్రమాలు, నేరాలు పెచ్చుమీరిపోయాయి. ప్రజాప్రతినిధులు వీధి రౌడీలై ప్రజలను, అధికారులను కూడా హింసిస్తున్నారు. గౌరవ శాసన సభలో వీటిని ప్రశ్నించే ప్రతిపక్షాన్ని అధికార బలంతో అణగదొక్కుతున్నారు. విపక్ష నేతలపై దూషణలు, దాడులు సాధారణమైపోయాయి. ప్రజాపక్షాన ప్రశ్నించే వీలు లేకుండా మైకులు కట్ అవుతున్నాయి. ప్రజాస్వామ్యమే అపహాస్యం పాలౌతోంది. చంద్రబాబు అరాచకపాలన రావణ రాజ్యాన్ని తలపిస్తోంది. అన్నిటినీ మించి ఫిరాయింపులను చంద్రబాబు ప్రభుత్వమే పెంచి పోషిస్తోంది. ఈ విషయాలపై అన్ని విధాలుగా పోరాటాలు చేసిన ప్రతిపక్ష పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికార పక్ష అరాచకత్వానికి తలవొంచేది లేదని నిర్భయంగా ప్రకటించారు. ప్రభుత్వ దమననీతికి ప్రజల మధ్యలోనే సమాధానం చెబుతానన్నారు. అసెంబ్లీలో గొంతు విప్పనివ్వకపోతే ప్రజాక్షేత్రంలో గళాన్ని వినిపిస్తానని సవాల్ చేసారు. సభా మర్యాదను కాపాడుతూ, ఫిరాయింపుదార్లపై వేటు వేసేంత వరకూ శాసన సభను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు విపక్ష నేతలు. 

ఇదో సంచలనాత్మక నిర్ణయం. ప్రభుత్వం చేసే దౌర్జన్యాన్ని ప్రంపచం ముందుకు తెచ్చిన సందర్భం. అందుకే చంద్రబాబు తన కుటిల నీతికి పదును పెట్టాడు. ప్రజల సమస్యలపై శాసన సభలో మాట్లాడకుండా తప్పించుకుంటున్నారంటూ అసత్య ప్రచారాలకు తెరలేపాడు. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదంటూ సన్నాయి నొక్కులు మొదలు పెట్టాడు. బాబుకు అల్జీమర్స్ వచ్చినంత మాత్రాన రాష్ట్ర ప్రజలందరికీ మతిమరుపు వ్యాధి వస్తుందా….? చంద్రబాబుకు స్వయంగా మావగారు అయిన స్వర్గీయ ఎన్టీరామారావు గారు సైతం అసెంబ్లీని బహిష్కరించారు. దానికి కారణం కూడా ప్రతిపక్షాన్ని పాలక పక్షం అవమానించడమే. వ్యక్తిగత ఆరోపణలతో అసెంబ్లీలో మనస్తాపానికి గురి చేసినందుకు ఆయన తన కండువాని స్పీకర్ ముందు విడిచిపెట్టారు. ఇది  నా ప్రతిష్ట. ఈ సభలో నా ఆత్మగౌరవం దెబ్బతింది. తిరిగి ముఖ్యమంత్రిగా, సభానాయకుడిగా, ప్రజా నాయకుడిగానే ఈ సభలో అడుగుపెడతానని సవాల్ చేసి వెళ్లిపోయారు. నిజంగా తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాతే సభలో అడుగు పెట్టారు ఎన్టీఆర్.  1989లో తమిళనాట అసెంబ్లీ లో కరుణానిధి ప్రభుత్వం లో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నిస్తున్నందుకు విపక్షంలో ఉన్న జయలలితపై దాడికి దిగారు డిఎంకె ఎమ్మెల్యేలు. ఆమె జుట్టును చెరిపి, కొంగును లాగి దారుణంగా అవమానించారు. మహిళలను, గౌరవ ప్రదమైన శాసన సభలో అవమానించినందుకు కన్నీళ్ల పర్యంతమైన జయలలిత సవాల్ చేసి మరీ శాసన సభను బహిష్కరించారు. తిరిగి సిఎమ్ గా అయ్యిన తర్వాతే అసెంబ్లీలో కాలు పెట్టారు. 

అన్యాయం జరిగిన ప్రతి చోటా న్యాయం తల వంచుకున్నట్టు అనిపించవచ్చుగాక, కానీ రెట్టించిన కసితో గెలిచి నిలవడం మాత్రం ఖాయం. ఇది చరిత్ర చెప్పిన సత్యం. చంద్రబాబుకు ఈ విషయం అర్థం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే నీతి, న్యాయం, విలువలు అనే విషయాలను నమ్మడం బాబు చరిత్రలో లేదు కదా…అసెంబ్లీని బహిష్కరించడం ప్రజా సమస్యలపై పోరాడటానికి, పోరాడి రణ క్షేత్రంలో విజయం సాధించడానికే అని బాబుకు అర్థమయ్యే రోజు దగ్గరలోనే ఉంది.