అసెంబ్లీలో పైచేయి
4 Sep, 2015 18:39 IST
ప్రభుత్వాన్ని ఉతికేసిన విపక్ష నేత
విమర్శల్ని పక్కన పెట్టిన పరిణితి
బిత్తరపోయిన అధికారపక్షం
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టబోయి అధికార పక్షం బోర్లా పడింది. చివరకు మంది బలంతో బయట పడి ఊపిరి పీల్చుకొంది.
సూటిగా సాగిన ప్రసంగాలు
అసెంబ్లీలో మంచి గ్రౌండ్ వర్క్ తో వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అదే విషయాన్ని స్పష్టం చేశారు. చంద్రబాబుది ఓల్డ్ జనరేషన్ అని తేల్చేశారు. అన్నట్లుగానే సబ్జెక్టు మీద పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనికి సంబంధించిన రిఫరెన్సు లను కూడా జోడించి ప్రసంగించారు. దీంతో జవాబు చెప్పలేని అధికార పక్షం అటూ ఇటూ చూడసాగింది.
తిట్లతో జవాబులు
ప్రతిపక్ష నేత ప్రశ్నలకు జవాబు చెప్పలేని ప్రభుత్వ పెద్దలు ఎప్పటిలాగే నోటికి పని చెప్పారు. విపక్ష నేత వైఎస్ జగన్ తిట్టడమే పనిగా సాగించారు. గతంలో ఈ విమర్శలకు జవాబు చెప్పటానికి ప్రయత్నించిన వైఎస్ జగన్ ఈ సారి ట్రెండ్ మార్చారు. మంత్రులు తనను తిట్టినా క్లుప్తంగా జవాబిచ్చి, తన ప్రసంగాన్ని కొనసాగించటం మొదలెట్టారు. ఎంత తిట్టినా చలించకుండా సబ్జెక్టు మీద మాట్లాడారు. దీంతో తల పట్టుకోవటం మంత్రుల వంతయింది.
అధికార పక్షం డొల్లతనం
చివరి రోజయితే అధికార పక్షం ఎత్తుగడలు విఫలం అయ్యాయి. ఓటుకి కోట్లు కుంభకోణం మీద చర్చిద్దామంటే అది కోర్టు పరిధిలోకి వస్తుందని తెలివి ప్రదర్శించారు. మరి వైఎస్ జగన్ మీద ఉన్నకేసులు, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రస్తావించటం సంగతేమిటని ఎదురు ప్రశ్నించేసరికి రభస సాగించారు. అసెంబ్లీని రెండు సార్లు వాయిదా వేయించి, చివరకు నిరవధికంగా వాయిదా వేయించేశారు. మొత్తం మీద సమావేశాల్లో పలాయన మంత్రం చిత్తగించి సరిపెట్టారు.