కక్ష కామన్.. తీరు మారుతోంది... !

11 Apr, 2016 17:34 IST

() భూములు ఇవ్వని రైతులపై కక్ష సాధింపు

() రక రకాలుగా బెదిరిస్తున్న చంద్రబాబు సర్కారు

() తాజాగా రోడ్లు వేస్తామంటూ బెదిరింపులు

అమరావతి) రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వని రైతుల మీద ప్రభుత్వం కక్ష తీర్చుకొంటోంది. ఇందుకు రక రకాల మార్గాలు అవలంబిస్తోంది. తాజాగా రోడ్లు వేస్తామంటూ మార్కింగ్ లు చేయటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా కక్ష సాధింపే అని మండిపడుతున్నారు.

మొదట నుంచీ అదే ధోరణి

రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో రైతుల నుంచి వేల ఎకరాలు భూములు లాక్కోవాలన్నది చంద్రబాబు సర్కారు ఆలోచన. ఇందుకు తగినట్లుగానే భయపెట్టి, ప్రలోభ పెట్టి, తప్పుడు ప్రచారాల చేసి భూములు లాక్కొన్నారు. అయినప్పటికీ కొంతమంది రైతులు బాబు ఎత్తుగడల్ని పసిగట్టి పొలాల్ని ఇవ్వలేదు. దీంతో వీరిని లొంగదీసుకొనేందుకు తప్పుడు మార్గాలు ఎంచుకొన్నారు. భూములు ఇవ్వని రైతుల పొలాల్లోని వ్యవసాయ ఉపకరణాలు తగలబెట్టించారు. తర్వాత గద్దే చంద్రశేఖర్ అనే రైతుకి చెందిన ఐదున్నర ఎకరాల చెరకు తోటను దగ్ధం చేశారు. భూములు ఇవ్వనందుకు ఐదు ఎకరాల అరటి తోటలను బుల్ డోజర్లతో దున్నేశారు. ఇవన్నీ చేయించింది తెలుగుదేశం గూండాలే అన్న సంగతిఅ క్కడ అందరికీ తెలుసు. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

రోడ్ల పేరుతో బెదిరింపులు

రాజధాని ప్రాంతంలో రోడ్లు వేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున భూముల్ని సేకరిస్తున్నారు. ఇందుకోసం భూములు ఇవ్వని రైతుల భూములు లేదా ఇళ్ల మీదుగా రోడ్ల కోసం మార్కింగ్ లు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. రోడ్ల పేరుతో తమ మీద కక్ష తీర్చుకొంటున్నారన్న సంగతి స్థానికులకు అర్థం అయింది. దీంతో సోమవారం నాడు సీ ఆర్ డీ ఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రోడ్ల పేరుతో అరాచకాలు చేయవద్దని వేడుకొన్నారు. తర్వాత సీ ఆర్ డీ ఏ కమీషనర్ శ్రీకాంత్ ను కలిశారు. పూలింగ్ నుంచి తమ భూముల్ని మినహాయించాలని, తమ మీద కక్ష సాధింపు వద్దని విన్నవించారు. దీని మీద ముఖ్యమంత్రి తో మాట్లాడతామని మాత్రం హామీ ఇచ్చారు.