వైఎస్సార్సీపీ రైల్వేజోన్ దీక్ష వెనుక కారణాలు..!
11 Apr, 2016 22:17 IST
() ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షల కోసం దీక్ష
() పునర్విభజన చట్టంలో పొందుపరచిన జోన్ హామీ
() టీడీపీ వైఫల్యాలపై పోరుబాట
విశాఖపట్నం) విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో వైఎస్సార్సీపీ ప్రత్యక్ష ఉద్యమానికి దిగుతోంది. ఈ నెల 14వ తేదీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాధ్ దీక్ష చేపడుతున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సూచన మేరకు పార్టీ తరపున దీక్ష చేస్తున్నారు.
ప్రత్యేక జోన్ నేపథ్యం
గతంలో ఉండే ఆగ్నేయ రైల్వేజోన్ ను 2003 లో తూర్పు కోస్తా రైల్వే జోన్ గా ఏర్పడింది. దీనికి భువనేశ్వర్ ముఖ్య కేంద్రంగా ఉంది. ఇందులో దాదాపుగా ఒడిశా రాష్ట్రం అంతటితో పాటు ఛత్తీస్ గడ్ లోని రెండు జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ లోని మూడు జిల్లాలు ఉన్నాయి. ఇందులో సంబల్ పూర్; వాల్తేర్, ఖుర్దా రోడ్ డివిజన్ లు ఉన్నాయి. తూర్పు కోస్తా రైల్వే ఉద్యోగాల భర్తీ విషయంలో కానీ, ఇతర వసతుల విషయంలో కానీ ఒడిశా ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో ఉత్తరాంధ్ర వాసులకు ఏ మాత్రం ప్రయోజనం ఉండటం లేదు. దీంతో కొద్ది కాలానికే వాల్తేరు కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకొంది. క్రమ క్రమంగా ఇది బల పడుతోంది.
విభజన చట్టం లో హామీ
ఆంధ్రప్రదేశ్ ను రెండు గా చీల్చాలని తెలుగుదేశం, కాంగ్రెస్ కుట్ర పన్నిన సమయంలో అవశేష ఆంధ్రప్రదేశ్ కు కొన్ని హామీలు ఇచ్చారు. విభజన చట్టంలో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు చట్టంలో పొందుపరిచారు. దీంతో ఉత్తరాంధ్ర ప్రజల కలలు నెరవేరుతాయని భావించారు. కానీ రైల్వే జోన్ విషయాన్ని టీడీపీ గాలికి వదిలేసింది. కేంద్రం మీద ఏమాత్రం ఒత్తిడి తీసుకొని రావటం లేదు. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలు అన్యాయానికి గురయ్యారు.
ప్రజల తరపున వైఎస్సార్సీపీ పోరుబాట
ఉత్తరాంధ్ర ప్రజల తరపున వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. అనేక దశలుగా ఆందోళనలు చేపట్టింది. అయినా సరే టీడీపీ, బీజేపీ లో చలనం లేదు. దీంతో ఈనెల 14 దాకా ఎదురు చూస్తామని, లేదంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. పార్టీ తరపున విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సూచన మేరకు పార్టీ తరపున దీక్ష చేస్తున్నారు. ఇందుకు సంఘీభావంగా ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోనూ వైఎస్సార్సీపీ తరపున కార్యక్రమాలు ఏర్పాటవుతున్నాయి.