ప్రజాసంకల్పం @ 150

1 May, 2018 12:02 IST


-      అంతఃకరణ శుద్ధితో అడుగులు వేస్తున్న యువనేత

-      ప్రజల ఆదరాభిమానాలే సంకల్పబలమై సాగుతోన్న ప్రజాసంకల్పం

-      150వ రోజుకు చేరిన పాదయాత్ర

-      అడుగడుగునా వైఎస్ జగన్ కు జన నీరాజనం

ప్రజా సంకల్ప యాత్ర నేడు 150వ రోజుకు చేరింది. సంక్షేమ స్వాప్నికుడు, ప్రజా నాయకుడి అడుగులు అలుపు లేకుండా సాగుతున్నాయి. అవరోధాలను అధిగమిస్తున్నాయి. ప్రజాబలంతో పోరాటాలకు ముందుకురుకుతున్నాయి. ఓ పక్క పాదయాత్ర, మరో పక్క ప్రజా ఉద్యమాలు రెండిటినీ సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ఈ యువనాయకుని చూసి తెలుగు నేల మురిసిపోతోంది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ మారుమోగుతున్న పేరు. ముఖ్యమంత్రి కుమారుడిగాకాదు, ప్రతిపక్ష నాయకుడి హోదాలో కాదు, ఆరోపణల చక్రవ్యూహంలో కాదు,...అంతకు మించి ప్రజల హృదయాలను కొల్లగొట్టిన జన నేతగా ఆయన ప్రాభవం దశదిశలా పరుచుకుంటోంది. ఆయన అడుగు కోటి గుండెల ఆశల వైపు. ఆయన చూపు రేపటి బంగారు భవిష్యత్ వైపు. ఆయన మాట ఐదు కోట్ల ఆంధ్రుల అస్తిత్వం.

ప్రజా సంకల్పంతో ముందడుగు

నవంబర్ 5 చరిత్రలో కొన్ని మైలు రాళ్లకు పునాది వేసిన రోజిది. ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించారు వాజ్ పేయ్. ప్రపంచ యువనికపై భారతీయ ప్రాచీన భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. క్రికెట్ ఆరాధ్య దైవం సచిన్ అంతర్జాతీయ క్రికెట్ లో తన శకాన్ని లిఖించడం మొదలు పెట్టింది కూడా సరిగ్గా ఇదే రోజు. అదే రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ఓ పెను సంచలనం మొదలైంది. ప్రజా పోరాటానికి తొలి అంకం సిద్ధమైంది. అదే ప్రజా సంకల్ప పాదయాత్ర. ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం, వారికి భరోసా ఇవ్వడం కోసమే ప్రజా సంకల్ప పాదయాత్రకు అంకురార్పణ చేస్తున్నట్టు చెప్పారు వైఎస్ జగన్. ప్రజల కోసం, ప్రజలు మెచ్చిన, వారే స్వయంగా రూపొందించుకున్న మేనిఫెస్టో ఈ పాదయాత్ర ద్వారా తీసుకొస్తామని చెప్పారు. ప్రజా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి హామీ నెరవేరుస్తామని, ప్రజలకు జవాబుదారీగా ఉంటామని తెలియజేసారు. ఇది అంతఃకరణ శుధితో ఓ ప్రజానాయకుడు చేసిన ప్రమాణం.

యువనేతకు ఘన స్వాగతం

ఇడుపుల పాయలో మహానేత పాదాలకు నమస్కరించి పాదయాత్రికుడయ్యారు వైఎస్ జగన్. ఆ తండ్రి అడుగుజాడలను మననం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తండ్రి ఆశయాలకు రూపమిస్తానని అడుగడుగునా ప్రమాణం చేసుకుంటూ నడుస్తున్నారు. తండ్రి చూపిన బాటలో సాగడమే కాదు, తండ్రిలా తరతరాలూ తనను గుర్తుంచుకునేలా పాలన అందిస్తానని నిబ్బరంగా చెబుతూ నడుస్తున్నారు. ఆ ఆత్మవిశ్వాసమే అతడి ఆశయాలకు పునాది. అది చూసి ఆంధ్రావని పులకించని క్షణం లేదు. అడుగు పడ్డ ప్రతి చోటా ప్రజా సమూహాల సందడే. ఆనందాల అలజడే. ఇన్నేళ్ల కష్టాలనూ పంచుకునేందుకు, కొండత అండగా నిలిచేందుకు తమ వాడొస్తున్నాడన్న సంబరమే. అవినీతి ప్రభుత్వం అడుగడుగునా వేధిస్తుంటే, కన్నీళ్లను కళ్లలో నింపుకుని, తమ బాధలను వైఎస్ జగన్ ముందు వెళ్లబోసుకుంటున్నారు ప్రజలు. ఏం జరుగుతోందో తెలుసుకోవడమే కాదు, ఏం చేస్తే బాగుంటుందో చెప్పండంటూ వారి మనసు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్. వారికి జరిగే అన్యాయాలకు న్యాయం చేస్తామని మాటిస్తున్నారు.

జిల్లాలు దాటుతూ జయభేరి మోగుతూ

వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలను దాటుకుని కృష్ణాజిల్లాలో ప్రవేసించాడు పాదయాత్రికుడు. కోట్లమంది గుండెచప్పుడును తన మనసులో నిక్షిప్తం చేసుకున్నాడు. వారి కష్టాలకు స్వాంతన ఇస్తానని మాటిచ్చాడు. ఆ మాట నిలబెట్టుకుంటాడనే ధీమాను వారి కళ్లలో తృప్తిగా చూసుకుంటున్నాడు. ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా జరిగే బహిరంగ సభల్లో ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. అఖండ ప్రజా వాహిని సాక్షిగా వారికి తనేం చేయగలడో స్పష్టంగా చెబుతున్నాడు. తనపై వచ్చే ఆరోపణలను నిర్భయంగా నిలిచి పోరాడుతున్నానని సగర్వంగా ప్రజల ముందే ప్రకటిస్తున్నాడు. ఒక్కో బహిరంగ సభా ఒక్కో జన సునామీని పోటెత్తిస్తోంది. ప్రజానేతకు జేజేలు పలకడమే కాదు, వెన్నుండి నడిపిస్తామని, వెన్నంటే నడుస్తామని వాగ్దానం చేస్తోంది. రాబోయే ఎన్నికల సమరానికి నేడే విజయభేరిని సూచిస్తోంది.