విలువల వ్యక్తిత్వం-ప్రజలతో మమేకం

26 Jun, 2018 19:11 IST

విలువలున్న రాజకీయ నాయకుడు అతడు. విమర్శలకు వెన్నుచూపని ధీరుడు అతడు. విశ్వసనీయ రాజకీయాలు అతడి లక్ష్యం. ఓటు విలువను మీ మనస్సాక్షిని అడగమని చెప్పాడు అతడు. అతడే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని, నాయకులకు జవాబుదారీతనాన్నీ అందించాలనుకుంటున్న ఓ నవ దార్శనికుడు. విలువలుగల రాజకీయం, విశ్వసనీయత గల నాయకుడు… ఇదీ అతడి సిద్ధాంతం.



విశ్వసనీయ రాజకీయాలు కావాలి

విశ్వసనీయత అంటే ఏమిటి? ఓ వాగ్దానం ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడం. ఓ నమ్మకాన్ని గెలిపించుకోవడం. నేటి రాజకీయాల్లో ఈ మాటకు అర్థం మారిపోయింది. అవసరానికి అబద్ధాన్ని అందంమైన హామీగా అందిస్తే చాలు. ఆ తర్వాత దాని గురించి అందరూ మర్చిపోవచ్చు. అటు ఇచ్చిన వాడు, ఇటు పుచ్చుకున్నవాడూ…ఎందుకంటే నాయకుడు చెప్పే మాటను నమ్మడం ప్రజల అసక్తతత. దాన్ని ఆయుధం చేసుకోవడం నీచ రాజకీయ వేత్తల కుతంత్రం. అందుకే ఇలాంటి దగాకోరు రాజకీయాలను ప్రక్షాళన చేయాలంటూ గళమెత్తాడా యువనేత. మాటిస్తే దానికి కట్టుబడాలి. ఎన్ని అవాంతరాలెదురైనా మాట తప్పకూడదు. మడమ తిప్పకూడదు అన్నాడు. అది ఆ తండ్రి తనయుడికి నేర్పిన విజ్ఞత. వందల హామీలు కుమ్మరించి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ నెరవేర్చని చంద్రబాబును విలువలు లేని మనిషి అని నిక్కచ్చిగా విమర్శించాడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ఇచ్చిన ప్రతి హామీనీ నిలబెట్టుకోవడమే తన నిజాయితీ అని నిర్భయంగా చెప్పాడు.

రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలి

ఎన్నికల వేళ నోటికొచ్చింది చెబుతాం. అధికారంలోకి వచ్చాక నోరెత్తితే అణగదొక్కేస్తాం అంటోంది చంద్రబాబు సర్కార్. మాకిచ్చిన హామీ ఏమైందని అడగబోతే అధికార జులుం అహంకారమైన సమాధానం ఇస్తోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ స్వేచ్ఛకు సంకెళ్లేస్తోంది. దీన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఖచ్చితంగా ఉండాలి అంటున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మాక్చిన హామీలేమయ్యాయి అని నేతలను నడిరోడ్డు మీద నిలదీసే అవకాశం ప్రజలకు ఉండాలని అంటున్నారు. ఆయన మాటలు ఎందరిపైనో ప్రభావం చూపుతున్నాయి. చైతన్యపరుస్తున్నాయి. ప్రభుత్వం అభివృద్ధి సంతృప్తి అన్నప్పుడల్లా ప్రజలు ఆగ్రహంతో కన్నెర్ర జేస్తున్నారు. ఇచ్చిన హామీల మాటేమైందని పదే పదే ప్రశ్నిస్తున్నారు.

ప్రజల విశ్వసాన్ని కాల రాస్తూ ఫిరాయింపులకు పాల్పడ్డ వారిపై కూడా పిడుగులు కురిపిస్తున్నారు వైఎస్ జగన్. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన వారిపై వేటు వేయకుండా పదవులిచ్చి మరీ పక్కనుంచుకున్న ప్రభుత్వ విచక్షణారాహిత్యాన్ని అడుగడుగునా ఎండగడుతున్నారు. పార్టీ మారినవారు తమ పదవులకు రాజీనామాలు చేసి తిరిగి ప్రజల్లోకి వెళ్లి గెలిచి చూపించాలని సవాల్ చేస్తున్నారు. అధికార పక్షంలో పదవిలో ఉండి ప్రతిపక్షంలోకి రావాలనుకున్న ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి గారిని రాజీనామా చేసి మరీ రమ్మనడం వైఎస్ జగన్ విలువల రాజకీయాలకు నిదర్శనం.  రాజ్యాంగానికే కళంకంగా మారిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ అసెంబ్లీని బహిష్కరించి ప్రజల్లోకి రావడం, ప్రభుత్వానికి ఓ చెంపపెట్టు లాంటి సమాధానం. ప్రజా వేదికలోనైనా, చట్ట సభల్లోనైనా ఈ అన్యాయం పై అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు వైస్ జగన్ మోహన్ రెడ్డి.

ఓటు ప్రజాయుధం

ఓటు విలువ అమూల్యమైనదని ప్రజలను చైతన్యపరుస్తున్నారు వైఎస్ జగన్. స్వార్థపరుల దొంగ హామీలను నమ్మి ఆ విలువైన ఓటును నష్టపరుచుకోకూడదని ప్రజలకు తెలియజేస్తున్నారు. మాయలు, మోసాలు, వలలు, ప్రలోభాలతో రాజకీయ పార్టీలు చేస్తున్న విన్యాసాలను విజ్ఞతతో గుర్తించాలని చెబుతున్నారు. కులం, మతం, వర్గాల మధ్య చిచ్చు పెట్టే స్వార్థ రాజకీయనాయకులకు ఓటుతోనే జవాబివ్వాలని వివరిస్తున్నారు. భవిష్యత్తుకు భరోసా ఇచ్చి, కష్టాలను సహృదయంతో అర్థం చేసుకునే వ్యక్తికి ఓటు వేయాలని చెబుతున్నారు. అన్నిటినీ మించి మనస్సాక్షి చెప్పినట్టు మీ ఓటు వేయండి అంటున్నారు వైఎస్ జగన్.

  

 (ప్రజా సంకల్పయాత్ర 200 రోజుల సందర్భంగా ప్రత్యేక కథనం)