పచ్చ గూడు ఓ సాలెపొద

23 Sep, 2018 19:29 IST

 

అరకు ఎమ్మెల్యే కిడారిసర్వేశ్వరరావును మావోలు కాల్చి చంపారనే వార్త రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. మావోలే లేరంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటల్లో వాస్తవం లేదని తేలిపోయింది. గత కొంత కాలంగా ఇంటిలిజెన్స్ వర్గాలు ఈ విషయం పై కొందరు నేతలకు జాగ్రత్తగా ఉండాలని సూచించినట్టు సమాచారం. కిడారి సర్వేశ్వరరావు 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి గత ఏడాది అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. అంతర్గత కలహాలు అని పైకి చెప్పినా చంద్రబాబు ప్రలోభాలే అందుకు కారణం అన్నది బహిరంగ సత్యం.

అరకు ఎంపి కొత్తపల్లి గీత, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్నంత కాలం వైఎస్ జగన్ నాయకత్వంలో, గిరిజనుల హక్కుల కోసం పోరాడినవారే. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా చట్టసభల్లో తమ గొంతును వినిపించినవారే. అక్రమ మైనింగ్ అనుమతులు, తవ్వకాలు, మైనింగ్ విధానాలపై అధికారపార్టీని అడ్డుకుంటూనే ఉన్నారు వైఎస్ జగన్. అందుకే టిడిపి ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉన్న గళాలను ప్రలోభపెట్టి, ఒక్కరిగా వారిని తమవైపు లాక్కున్నారు. టిడిపిలో చేరిన తర్వాత ఈ ముగ్గురిలో ఒక్కరు కూడా బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. గత కొంత కాలంగా పర్యవరణ విరుద్ధమైన బాక్సైట్ తవ్వకాల విషయంలో ఎమ్మెల్యేకు మావోలు హెచ్చరికలు జారీ చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆయనతోపాటే ఉన్న మాజీ టిడిపి ఎమ్మెల్యేను సోమను కూడా మావోలు కాల్చి చంపారు.

బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతోకాలంగా పోరాడుతోంది. గిరిజనుల హక్కులు, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఖనిజాల తవ్వకాలపై ప్రతిపక్ష పార్టీ అధికార తెలుగుదేశం నాయకులఆగడాలను ప్రజలముందు పెడుతూనే ఉంది. నిబంధనలను తుంగలో తొక్కుతూ పల్నాడులో అధికారపార్టీ ఎమ్మెల్యే ఎరపతినేని చేస్తున్న మైనింగ్ వ్యాపారాలను, చింతమనేనిఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అటు చట్టసభల్లోనూ, ఇటు న్యాయస్థానంలోనూ ప్రశ్నిస్తూనే ఉంది. ప్రజల తరఫున నిలబడి ప్రభుత్వాన్ని నిలవరిస్తూనే ఉంది.

బాక్సైట్ ను తవ్వి పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం, సొంత నేతలకు ప్రయోజనాలు చేకూర్చడమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిచంద్రబాబు విజన్. ఈ విజన్ కు అడ్డుగా ఉన్నవారిని నయానో, భయానో, పదవుల ఎరతోనో చేరదీసుకుని, తన అక్రమార్గ పాలనకు పావులుగా వాడుకుంటున్నాడు చంద్రబాబు. ఒక్కసారి బాబు గూటికి చేరడమంటే పచ్చగా మెరిసే వలలో చిక్కుకోవడమే. అక్రమాల సాలెగూటిలో బందీకావడమే. ఒక్కప్పుడు భూమా నాగిరెడ్డిపై అక్రమ కేసులు బనాయించి, బెదిరింపులతో పార్టీ మారేలా చేసి, దారుణంగా అవమానించి మానసిక వేదనకు గురిచేసి ఆయన మరణానికి కారణం అయ్యాడు బాబు. బాబు ప్రలోభాలకు లొంగి ఆ పార్టీలో చేరిన నేతల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ వచ్చే అవకాశం ఉండదని, ఒకవేళ వచ్చినా స్థానికంగా ముఖం చూపించలేని పరిస్థితుల్లో వారున్నారు. బాబు అక్రమాలకు తలూపాల్సిన దుస్థితిలో ఉండిపోవడంతో ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి, ముఖం చూపించలేని స్థితిలో ఉన్నారని చెబుతున్నారు. పదవులు, ప్రలోభాలకు లొంగి టిడిపి గూటిలో చిక్కుకున్న పాపానికి రాజకీయ భవిష్యత్తు, ప్రజల్లో నమ్మకం రెండూ నాశనం అయ్యాయని కుమిలిపోతున్నారు ఫిరాయింపునేతలు. ఇప్పుడు అరకు ఎమ్మెల్యే హత్య ఘటన చూస్తే టిడిపి నాయకుల అవినీతిలో భాగస్వామ్యానికి కలిగే ఫలితంలా ఉందని అంటున్నారు తెలుగు ప్రజలు.