ప్రాజెక్టు ఒకటి – ప్రారంభోత్సవాలు ఎన్నో…?

8 Sep, 2017 14:07 IST
-ముచ్చుమర్రి కి ఎన్ని సార్లు ప్రారంభోత్సవం చేస్తారు?
-అసలు ప్రాజెక్టు పూర్తి అయ్యిందా అనేది అనుమానమే?
-ముచ్చుమర్రిని ఆరంభించిది వైయస్ ఆర్
-5tmcల ఎత్తిపోతలకే ఈ హడావిడి అంతా

వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు చంద్రబాబు అంటున్నారు జనాలు. భారీ భారీ ప్రకటనలతో కొత్త కొత్త సాగునీటి ప్రాజెక్టులను ఆరంభిస్తున్న అపర భగీరధుడి ఫోజులతో ఫుల్ పేజ్ పేపర్ యాడ్స్ చూస్తుంటే ప్రజలకు దిమ్మతిరిగి బొమ్మ కనబడుతోంది. అయితే ఆ ప్రాజెక్టులన్నీ గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నవే అని, వాటి విస్తరణ పనులు మాత్రమే చంద్రబాబు చేస్తున్నాడని తెలిస్తే ముక్కున వేలేసుకోవాలి. ఇంకో విచిత్రం ఏమంటే ఒకే ప్రాజెక్టుకి ఏడాదికి రెండు మూడు సార్లు ప్రారంభోత్సవం చేస్తారు బాబు గారు. హంద్రీ నీవా సుజల స్రవంతి – మెదటి దశకు అనుసంధానించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం ఘనంగా చేస్తున్నారు. ఇదే ఏడాది జనవరి 2వ తారీకున చంద్రబాబు ఇదే పథకాన్ని ప్రారంభోత్సవం చేసారు. ఇదెలా అంటే అంతే మరి…’రోజూ నా కల్లోకి కూడా ముచ్చుమర్రే వస్తోంది – ఇది నా పూర్వజన్మ సుకృతం – ఈ ప్రదేశం పర్యాటకంగా అభివృద్ధి కావాలి’ అని వ్యాఖ్యానించారు చంద్రబాబు. ‘పట్టుదలతో, దూరదృష్టితో పని చేసి రాయల సీమ బంగారం పండిస్తుంద’ని చెప్పారు. అదే బాబు మళ్లీ ఈరోజు ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రారంభోత్సవం అంటున్నాడు. అసలు బాబు చేస్తున్నదేమిటో ప్రజలకు అర్థం కావడం లేదు. 

ఇక రెండుసార్లు ప్రాంభోత్సవం చేసుకుంటున్న ముచ్చుమర్రి గురించి పూర్తి వివరాలు ఇవి -
హోస్పేట తుంగభద్ర డామ్ నుంచి HLCకి తక్కువ నీరు వస్తుండటంతో అనంతపురం నాయకులు మెరపెట్టుకోగా 2004లో చంద్రబాబు సుంకేసుల డ్యామ్ కు రావలసిన 10tmc ల నుంచి 5tmcలు వాడుకోడానికి అనుమతి నిస్తూ జివో చేసారు. ఇది 2004 ఎన్నికలకు కొద్ది నెలల ముందు సంగతి. ఆ తరువాత వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి  అయ్యారు. KC కెనాల్ రైతుల కోటా నుంచి 5tmc లు HLC కి ఇచ్చారు కనుక వారికి ఆ నష్టాన్ని పూడ్చటానికి వైయస్సార్ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుండి 5tmc లు వాడుకోమని జి.వొ ఇచ్చారు.  Kc కెనాల్ కి ఎగువన 120కి.మీ లలో బనక చెర్ల ఉంది. మరి సుకేసుల నుంచి బనకచెర్ల మధ్య రైతులకు కూడా న్యాయం జరగాలనే సదుద్దేశ్యంతో ముఖ్యమంత్రి KC కెనాల్ 70వ కి.మీ దగ్గర ముచ్చుమర్రి ప్రాంతంలో కొత్త లిఫ్ట్ ఏర్పాటుకు 2007 ఆగస్టులో జివొ ఇచ్చారు. 4పంపులతో ఒక లిఫ్ట్ KC కెనాల్ కోసం, 12 పంపులతో మరో లిఫ్ట్ కట్టాలి. 2007లో ముచ్చుమర్రి మొదలైనా వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వచ్చిన కిరణ్ సర్కార్ ముచ్చు మర్రి పనులను ఆపేసింది. ఇది ముచ్చుమర్రి అసలు కథ. 

ఇక బాబుగారి ఎంట్రీ సంగతి చూద్దాం. 2016లో బాబుగారు ముచ్చుమర్రిని తిరిగి ప్రాంరంభించినట్టు ప్రకటించారు. గత జనవరి 2వ తారీకున ముచ్చుమర్రి లిఫ్టును ప్రారంభించి జాతికి అంకితం చేసారు. నది నుంచి మోటర్ల దగ్గరికి నీళ్లు పారవలసిన దూరం 3.5కి.మీలు. అప్రోచ్ చానల్ కి అడ్డంగా పెద్ద గడ్ ఉంది. నీరు మామూలుగా లిఫ్టు వరకూ రాదు, ప్రారంభోత్సవం కోసం ఆ సమయంలో నీటిని ఎత్తిపోసారు. ఇది ఒక దగా కోరు ప్రారంభోత్సవం. దాని తర్వాత నీళ్లిస్తాం పంటలు వేసుకోండి అని ముచ్చుమర్రి రైతులకు చెప్పారు. తీరా పంటలు వేసాక నీళ్లు ఇవ్వకపోవడంతో రైతులందరూ ఉరితాళ్లతో హంద్రీ కాలువ మీదకెళ్లి నిరసన ప్రదర్శించారు. సగం కూడా పూర్తికాని ముచ్చుమర్రిని జనవరిలో ప్రారంభించిన చంద్రబాబు మాయా నాటకం ఇది. ఇప్పుడు అదే ప్రాజెక్టును మళ్లీ ప్రారంభోత్సవం అంటూ హడావిడి చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.
బాబు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఇలా జనం చెవిలో పువ్వులు పెడుతున్నారు.