యువ భేరి ఎందుకంటే..!

4 Aug, 2016 14:01 IST

() ప్రత్యేక హోదా తో ఎన్నెన్నో ప్రయోజనాలు

() హోదా ఆవశ్యకతతో యువతలో చైతన్యం

() యువతకు దిశానిర్దేశం చేసేందుకు యువ భేరి

విభజనతో, ఆ తర్వాత చంద్రబాబు నిర్వాకాలతో కుదేలైపోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఒక సంజీవని. అటువంటి సంజీవని ని సాధించుకొనేందుకు వైయస్సార్సీపీ పోరాటం చేస్తోంది. ఈ పోరాటం కోసం, ఈ సమున్నత లక్ష్యం కోసం పోరాడేందుకు యువత, విద్యార్థుల్లో చైతన్యం రావాలి. ప్రత్యేక హోదా తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో విద్యార్థులు, యువతకు తెలియపరిచేందుకు ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ యువభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రత్యేక హోదా తో ప్రయోజనాలు

() కేంద్ర గ్రాంట్లు 90శాతం వ‌స్తాయి
- ఆర్థిక సంఘం సిఫార్సుల మేర‌కు ప‌న్నుల్లో వాటాతో పాటు గ్రాంట్లు, లోన్ ద్వారా రాష్ట్రాల‌కు సొమ్ము అందుతుంది. గ్రాంట్ అంటే తిరిగి చెల్లించ‌న‌క్క‌ర‌లేని సొమ్ము. అదే లోన్ అయితే తిరిగి చెల్లించాలి.
- స్పెష‌ల్ కేట‌గిరీ లేని రాష్ట్రాల‌కు కేంద్ర ఇచ్చే గ్రాంట్లు 30శాతానికి మించి ఉండ‌వు. అంటే ఏ ప‌థ‌కం, ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా... కేంద్రం గ్రాంట్ పోనూ మిగ‌తా 70శాతం లోనుగానే వ‌స్తుంది.
- అదే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తే కేంద్ర గ్రాంట్ 90శాతం అందుతుంది. లోన్ కేవ‌లం 10శాతం ఉంటుంది.


భారీ పారి శ్రామిక రాయితీలు...
- దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 11 రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చారు. ఆ 11 రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చినందునే ప‌రిశ్ర‌మ‌ల‌కు రాయితీలు భారీగా వ‌చ్చాయి. మిగ‌తా రాష్ట్రాల‌కు అర‌కొర పారిశ్రామిక రాయితీలు ల‌భిస్తే ప్ర‌త్యేక హోదా రాష్ట్రాల‌కు అత్యంత భారీగా పారిశ్రామిక రాయితీలు ద‌క్కాయి. చంద్ర‌బాబు తదితరులు చెబుతున్నదేమంటే  ప్ర‌త్యేక హోదా వేరు - పారిశ్రామిక రాయితీలు వేరు అంటున్నారు. ఇది అబద్ధం. ప్ర‌త్యేక హోదా లేకుండా దేశ చ‌రిత్ర‌లో ఏ ఒక్క రాష్ట్రానికి అటువంటి భారీ పారిశ్రామిక రాయితీలు ల‌భించ‌లేదు. ఇది తెలిసీ చంద్ర‌బాబు అబద్ధాలు చెప్ప‌టం మ‌రీ దారుణం. వేల‌కొద్దీ ప‌రిశ్ర‌మ‌లు, వాటితో పాటు ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉద్యోగాలు రావాల‌న్నా క‌చ్చితంగా ప్ర‌త్యేక హోదా కావాలి.


ప‌రిశ్ర‌మ‌ల‌కు మ‌హ‌ర్ద‌శ‌... ఉద్యోగాల వెల్లువ‌
- ప్ర‌త్యేక హోదా ఉంటేనే పారిశ్రామిక యూనిట్ల‌కు 100శాతం ఎక్సైజ్ డ్యూటీ మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఆదాయం మీద ప‌న్నులో (ఇన్‌క‌మ్ ట్యాక్స్ - ఐటి) కూడా 100 శాతం రాయితీ ల‌భిస్తుంది. ప‌న్ను మిన‌హాయింపులు, ఫ్రైట్ రీయింబ‌ర్స్‌మెంట్‌లు ద‌క్కుతాయి. ప్ర‌త్యేక హోదాతో దక్కే ఇలాంటి రాయితీలు ఉంటేనే మిగ‌తా రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు పెద్ద‌పెద్ద కంపెనీల పారిశ్రామిక వేత్త‌లు రెక్క‌లు క‌ట్టుకు వ‌స్తారు. ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు వ‌స్తాయి. ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉద్యోగాలు స‌మ‌కూర‌తాయి.
- ప్లాంట్లు, యంత్రాల మీద పెట్టే పెట్టుబ‌డిలో 30శాతం రాయితీ ల‌భిస్తుంది. కొత్త‌గా ఏర్పాటయ్యే ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు, ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌ట‌న నాటికే ఏర్పాటై... ఆ త‌ర్వాత విస్త‌ర‌ణ చేప‌ట్టిన ప‌రిశ్ర‌మ‌ల‌కు కూడా ఇది వ‌ర్తిస్తుంది.
- మ‌న రాష్ట్రంలో ఉన్న ఔత్సాహికులు సొంతంగా ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేయ‌డానికి ఈ నిర్ణ‌యాలు దోహ‌దం చేస్తాయి. మ‌ధ్య‌, చిన్న‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ఇలాంటి రాయితీలు ప‌నికి వ‌స్తాయి. 
- పరిశ్ర‌మ‌ల ఏర్పాటుకు తీసుకునే వ‌ర్కింగ్ క్యాపిట‌ల్‌పై 3 శాతం వ‌డ్డీ రాయితీ ల‌భిస్తుంది. 
- ప‌రిశ్ర‌మ‌లకు 20 ఏళ్ళ‌కు త‌గ్గ‌కుండా విద్యుత్ చార్జీల‌పై 50 శాతం రాయితీ ల‌భిస్తుంది.
- ఇవే కాకుండా ఇన్సూరెన్స్‌, ర‌వాణా వ్య‌యంపైనా రాయితీలు ఉంటాయి.
- కేంద్ర సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా, భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ ఏర్పాటు స‌మీకృత మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కేంద్రాల ఏర్పాటులో పెట్టుబ‌డుల తీరును ప్ర‌త్యేక హోదా మారుస్తుంది. ప్ర‌భుత్వ రంగంలోని ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్ వంటివి కూడా భారీ పెట్టుబ‌డుల‌తో ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది.
- సాధార‌ణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే కేంద్ర‌, రాష్ట్ర పెట్టుబ‌డుల నిష్ప‌త్తి  2:3గ‌ఆ ఉంటుంది. అదే ప్ర‌త్యేక హోదా ఉంటే 4:1 నిష్ప‌త్తిలో ఉంటుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ప‌దేళ్ళ ప్ర‌త్యేక హోదాతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 13 జిల్లాలూ ఒక్కో హైద‌రాబాద్‌గా రూపొందుతాయి. కంపెనీలే నిరుద్యోగుల వెంట ప‌డే ప‌రిస్థితి వ‌స్తుంది. నో వేకెన్సీ బోర్డులు పోయి వాంటెడ్ అంటూ ప్ర‌తి కంపెనీ ఎదుటూ బోర్డులు పెట్టే ప‌రిస్థితి వ‌స్తుంది. ప‌న్ను రాయితీలు, ప్రోత్సాహ‌కాల వ‌ల్ల మ‌నం కొనుగోలు చేస్తున్న అనేక వ‌స్తువుల ధ‌ర‌లు స‌గానికి స‌గం త‌గ్గే అవ‌కాశం ఉంది. ఉత్ప‌త్తి చేసేవ‌స్తువుల మీద 100 శాతం ప‌న్ను రాయితీలు ల‌భిస్తే ఏ రాష్ట్రంలోనూ ల‌భించ‌నంత చౌక‌గా మ‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వ‌స్తువులు అందుతాయి.
 హోదా ఉంటే మ‌న నీటి ప్రాజెక్టుల్ని కేంద్ర‌మే క‌డుతుంది.
- యాక్సిల‌రేటెడ్ ఇరిగేష‌న్ బెనిఫిట్ ప్రోగ్రామ్‌(ఏఐబీపీ) అన‌ది కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టుల‌కు నిధులు ఇచ్చే కార్య‌క్ర‌మం. ప్ర‌త్యేక హోదా లేని రాష్ట్రాల‌కు ఈ ప‌థ‌కం కింద ప్రాజెక్టులు వ‌చ్చినా మ‌హా అయితే 25 నుంచి 50 శాతం నిధులు గ్రాంట్‌గా ఇస్తారు. అదే ప్ర‌త్యేక హోదా ఉన్న రాష్ట్రాల‌కు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 90శాతం నిధుల‌ను కేంద్ర‌మే గ్రాంట్‌గా ఇస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఆంధ్రప్ర‌దేశ్ పున‌ర్ వ్య‌వ‌స్థీకర‌ణ చ‌ట్టం పేరా నంబ‌ర్ 10లో హంద్రీ-నీవా, గాలేరు-న‌గ‌రి, వంటి నీటి ప‌థ‌కాలు ఉన్నాయి. ఇవి పూర్తి కావాలంటే క‌నీసం రూ. 8వేల కోట్లు కావాలి. ప్ర‌త్యేక హోదా ఉంటేనే ఈ ప్రాజెక్టుల‌కు 90శాతం డ‌బ్బు గ్రాంట్‌గా వ‌స్తుంది.


మ‌న రుణాన్ని కేంద్రమే చెల్లిస్తుంది
- ఎక్స్‌ట‌ర్న‌ల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల‌కు సంబంధించి విదేశీ రుణ భారాన్ని కేంద్ర‌మే భ‌రిస్తుంది. రుణంలో 90శాతం మొత్తాన్ని కేంద్ర‌మే గ్రాంటుగా ఇస్తుంది.
- ఆ రుణంపై వ‌డ్డీ కూడా కేంద్ర‌మే క‌డుతుంది.
- ఉదాహ‌ర‌ణ‌కు విశాఖ‌ప‌ట్నం-చెన్నై పారిశ్రామిక కారిడ‌ర్ ఏర్పాటుకు రూ. 5000 కోట్ల రుణాన్ని ఆసియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ నుంచి తీసుకోవాల‌నే ప్ర‌తిపాద‌న ఉంది. విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ మెట్రో రైళ్ళ ఏర్పాటుకు దాదాపు రూ. 8 వేల కోట్లు ఖ‌ర్చ‌వుతాయ‌ని అంచ‌నా. ఈ రెండు ప్రాజెక్టుల‌కు కూడా విదేశీ ఏజెన్సీల నుంచి రుణం పొంద‌నున్నారు. ప్ర‌త్యేక హోదా ఇస్తే 90శాతం రుణాన్ని గ్రాంట్‌గా ఇవ్వ‌టంతో పాటు వ‌డ్డీ కూడా కేంద్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది. విశాఖ‌-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, విశాఖ‌, విజ‌య‌వాడ‌(వీజీటీఎం) మెట్రో రైళ్ళు.... విభ‌జ‌న చ‌ట్టంలో హామీలే. 90 శాతం రుణం కేంద్రం భ‌రిస్తే.... విశాఖ‌-చెన్నై పారిశ్రామిక కారిడ‌ర్‌తో పాటు అన్నీ వ‌స్తాయి. ఎంద‌రో పారిశ్రామిక‌వేత్త‌లు కారిడార్ పొడ‌వునా ప‌రిశ్ర‌మ‌లు పెడ‌తారు. భారీగా ఉద్యోగాలూ వ‌స్తాయి. కారిడార్ వెంబ‌డి అనుంబంధ ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయి. ఉపాధి, యువ‌త ముందుకు వ‌స్తుంది. అదే ప్ర‌త్యేక హోదా లేక‌పోతే, ఈ ప్రాజెక్టుల‌న్నింటికీ కేంద్రం నిధుల్ని గ్రాంట్‌గా ఇచ్చే విష‌యం దేవుడెరుగు.... వ‌డ్డీతో స‌హా మొత్తం మ‌న రాష్ట్ర‌మే క‌ట్టాల్సి వ‌స్తుంది. అటువంటి ప‌రిస్థితుల్లో గ్రాంట్లు ఇస్తే గిస్తే... వారి ద‌య - మ‌న ప్రాప్తం!


ప్ర‌యోజ‌నం పొందిన రాష్ట్రాలు
ఉదాహ‌ర‌ణ‌కు ఉత్త‌రాఖండ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం వ‌ల్ల ఆ రాష్ట్రంలో 2 వేల ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయి. రూ. 30వేల కోట్ల పెట్టుబ‌డుల‌తో ఒకేసారి 130శాతం అధికంగా ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు కావ‌డం వ‌ల్ల ఉపాధి అవ‌కాశాలు 490 శాతం పెరిగాయి.
- మ‌న రాష్ట్రం కంటే బాగా వెనక‌బ‌డిన హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా వ‌ల్ల ఏకంగా 10వేల ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయి. 
- 972 కిలోమీట‌ర్ల స‌ముద్ర‌తీరం ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్కు ప్ర‌త్యేక హోదా ల‌భిస్తే అది ఈ రాష్టం పాలిట సంజీవ‌నిగా ఉప‌యోగ‌ప‌డ‌దా?

 

ద్వితీయ ఆర్థిక వ్యవస్థకు ఊతం

ప్రత్యేక హోదా తో పెట్టుబడులు తరలివచ్చి డబ్బులు సమాజంలో తిరుగాడతాయి. అప్పుడు ప్రజల దగ్గర డబ్బులు చేరతాయి. అప్పుడు కొనుగోలు శక్తి పెరుగుతుంది. దీంతో హోటల్ వాళ్లు, చిల్లర వ్యాపారులు, చిరు వర్తకులు దగ్గర అమ్మకాలు ఊపందుకొంటాయి. ఫలితంగా ఈ వర్గాల వారికి కూడా ప్రయోజనాలు దక్కుతాయి. ఉద్యోగులు, స్వయం ఉఫాధి పొందుతున్నవారితో పాటు చిన్న వ్యాపారులు, వ్రత్తి కార్మికుల దగ్గర డబ్బుల ప్రవాహం పెరిగితే పొదుపు, మదుపు చేసుకోగలుగుతారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు అవకాశం కలుగుతుంది.