హైటెక్ వ్యవసాయం లో నకిలీ దందా

25 Jun, 2018 18:33 IST

 

వ్యవసాయం దండగ అన్నాడు చంద్రబాబు. కొంతకాలం తర్వాత దాన్ని కాస్త మోడిఫై చేసి రైతులంతా వ్యాపారస్తులు కావాలన్నాడు. అంటే వ్యవసాయాన్ని ఈ రాష్ట్రం నుంచే దూరం చేసి, ఫక్తు వ్యాపార కేంద్రంగా మాత్రమే మార్చాలన్నది చంద్రబాబు విజన్. పంటపొలాలను ప్లాట్లు చేయడం, తిండి గింజలను పండించడం మాని పత్తిలాంటి వాణిజ్యపంటలే పండించమని చెప్పడం బాబు విజన్ లో భాగాలే. పోనీ ఆ వాణిజ్యపంటలు పండించాలన్నా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిచడం లేదు. రైతులు నకిలీ విత్తనాలను కొని పంట చేతికి రాక, పెట్టుబడి నేలపాలై కుంగిపోతున్నారు. గుంటూరులో నిషేధిత బీటీ 3 పత్తి విత్తనాలు బైటపడ్డాయి. అలాగే నకిలీ మిర్చి విత్తనాలు కూడా దొరికాయి. గుంటూరు పరిసరాల్లోనే ఇవి తయారౌతున్నట్టు అధికారులదగ్గర సమాచారం కూడా ఉంది. రాజధాని జిల్లాలోనే నకిలీ విత్తనాలు, నిషేధిత విత్తనాలు తయారవ్వడం మామూలు విషయం కాదు. అమాయకులైన రైతులు వీటిని కొనుగోలు చేసి దారుణంగా నష్టపోతున్నారు. రైతుల కోసం ఎన్నో చేస్తున్నామంటూ చెబుతున్న సర్కార్ నకిలీలను అరికట్టడంలో ఘోరంగా విఫలం అవుతోంది. అన్నదాతల ఆక్రోశానికి కారణం అవుతోంది.

రైతుల ఉసురు తగిలే పదేళ్లు పదవికి దూరమైన చంద్రబాబు పైకి రైతు సంక్షేమం అంటూ లోన రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాడు. అన్నదాతలకోసమంటూతన పేర అరడజను పథకాలు ప్రకటించాడు. కోట్లకొద్దీ నిథులను కూడా ఆ పథకాలు కుమ్మరించాడు. కానీ వ్యవసాయరంగంలో అభివృద్ధి శూన్యం. 11 శాతం అభివృద్ధి అంటూ బాబు చెప్పిన గణాంకాలన్నీ పాడి, మత్స్యపరిశ్రమలకు సంబంధించిన్న లెక్కలు కలిపితే వచ్చినవే అంటున్నారు నిపుణులు.

పథకాలు జాడేది

రైతులకోసం చంద్రన్న రైతు క్షేత్రం అన్నాడు. రైతులను ఆధునిక వ్యవసాయ విధానాలకు మళ్లిస్తున్నామని ప్రచారాలు చేసాడు. రసాయిన ఎరువుల వినయోగం తగ్గించి, సేంద్రీయ ఎరువుల వాడకం పెంచి, తక్కువ పెట్టుబడితో అధిగ దిగుబడులు సాధించేందుకు వ్యవసాయశాఖ చంద్రన్న రైతు క్షేత్రాలు పథకం ప్రారంభించారు. ఏటా 90లక్షల నిధులు ఖర్చు చేస్తున్నారు. కానీ ఫలితాలు మాత్రం అందుకు తగ్గట్టుగా లేవు. ఇందుకు రాయితీలు ఇస్తున్న ఎరువులు, పురుగు మందలు పక్కదారి పడుతున్నాయి. టిడిపి అనుకూలురైన బడా రైతుల క్షేత్రాలనే ఈ పథకాలకు ఎంపిక చేయడం మరో కుమ్మక్కు కోణం. ఏడాదిలో ఒకటి రెండు సార్లు తప్ప సేంద్రీయ వ్యవసాయం గురించి అవగాహనా కార్యక్రమాలే ఉండవు. గత రెండేళ్లలో 150 చంద్రన్న రైతు క్షేత్రాలు నిర్వహిస్తే ఎక్కడా పూర్తి ఫలితాలు కనిపించలేదు. సీజ్ దాటాక ఎరువుల సరఫరా, అవి కూడా నాణ్యత లేకపోవడం, వర్షాభావ పరిస్థితులు,  సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన లేకపోవడం వల్ల ఈ పథకం చతికిలబడింది. ఎరువులు సరఫరా చేసిన కంపెనీలకు వ్యవసాయశాఖ భారీగా చెల్లింపులు చేసింది.

రైతు రధాలంటూ చంద్రబాబు ఆడంబరంగా మొదలెట్టిన పథకం ప్రతి మండలంలోనూ అట్టర్ ఫ్లాపే అయ్యింది. వేల సంఖ్యలో రైతులుంటే పట్టుమని పదిమందికి కూడా ఈ పథకం కింద ట్రాక్టర్లు, పనిముట్లు అందలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపికైన వాళ్లలో కనీసం సగం మందికి కూడా రైతు రథాలు అందలేదు. అర్హులుగా ప్రకటించిన రైతులకు రైతు రథాలు అందించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. చివరకు ఈ పథకంలోనూ తెలుగు తమ్ముళ్లకే పెద్దపీట వేసినట్టు ఆరోపణలున్నాయి.

వైఎస్సార్ హయాంలో జలయజ్ఞంతో రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయి. ప్రాజెక్టులు జలకళతో కళకళలాడాయి. రుణమాఫీ నుంచి ఉచిత విద్యుత్ వరకూ అన్నదాతలకు అండగా నిలిచే ఎన్నో కార్యక్రమాలు చేసారు. కానీ బాబు హయాంలో మాటలు కోటలు చేతలు బూటకాలు చందాన ఉంది వ్యవసాయరంగ పరిస్థితి. చంద్రబాబుది హైటెక్ వ్యవసాయం, లోకేష్ ది ట్విట్టర్ సేద్యం అని విమర్శలు ఇందుకే వచ్చాయి.