రాజధాని కోసం అడవుల్ని మింగేస్తున్నారు..!

25 May, 2016 16:30 IST


() రాజధాని పేరుతో అడవుల్ని మాయం చేసేందుకు కుట్రలు

() పచ్చని పంట పొలాలు, అటవీ సంపద మాయం

() విదేశీ బినామీ సంస్థల కోసం లక్ష ఎకరాలు ఖాళీ

అమరావతి) రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. భూముల నుంచి లాక్కొన్న భూములే కాకుండా తాజాగా అటవీ భూముల్ని మింగేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఒకటి రెండు కాదు, 32వేల ఎకరాల అడవుల్ని విదేశీ బినామీ సంస్థలకు అప్పగించేందుకు చక చక ప్రయత్నాలు జరగుతున్నాయి.

          అమరావతి లో రాజధాని ప్రకటించినప్పటి నుంచి చంద్రబాబు కన్ను అక్కడే ఉంది. మొదటగా అక్కడ రైతులకు మాయ మాటలు చెప్పి, బెదిరించి, భయపెట్టి 33 వేల ఎకరాల భూముల్ని లాగేశారు. 2,3 వేల ఎకరాల్లో అద్భుతమైన రాజధాని కట్టడాలు పూర్తవుతాయని తెలిసినప్పటికీ మాయ మాటలు కొనసాగించారు. అక్కడ చుట్టు పక్కల ఉండే రెవిన్యూ, గ్రామకంఠం, దేవాదాయ, వక్ఫ్ భూముల్ని వీటిలో కలిపేశారు. వీటి విలువ మరో 35వేల ఎకరాల దాకా ఉంటుందని అంచనా.

          అదే ప్రాంతంలో ఉన్న అటవీ భూముల మీద చంద్రబాబు కన్ను పడింది. అక్కడ ఉండే 32వేల ఎకరాల అటవీ భూముల్ని లాగేసుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అటవీ భూముల్ని పెద్ద ఎత్తున ఖాళీ చేయాలంటే అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. ఇందుకోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ తయారు చేసి పంపించింది. వీటిని వెంటనే ఆమోదించాలని ఒత్తిడి చేసింది. దీని మీద కేంద్రం అనుమానాలు వ్యక్తం చేసింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఈ మాదిరిగా వేల ఎకరాల అటవీ భూముల్ని మాయం చేయటంపై అభ్యంతరం తెలిపింది. దీంతో  ఈ బాగోతం వెలుగు చూసింది.

          రైతుల నుంచి లాక్కొన్న భూమి 33 వేల ఎకరాలు, అటవీ భూములు 32వేల ఎకరాలు, ఇతర ప్రభుత్వ శాఖల భూములు 35వేల ఎకరాల్ని కలుపుకొంటే దాదాపు లక్ష ఎకరాల విస్తీర్ణంలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు రంగం సిద్ధం చేసుకొన్నట్లు సమాచారం. అందుకే అన్ని పనుల్ని పక్కన పెట్టేసి మరీ చంద్రబాబు రాజధాని భూముల వ్యవహారాన్ని చక్కబెట్టకొంటున్నట్లు తెలుస్తోంది.