పల్లె కన్నీరు పెడుతోంది
10 Sep, 2015 18:49 IST
అనంతలో ఆగని రైతు ఆత్మహత్యలు
రాయల సీమలో కరవు విలయ తాండవం
రుణ మాఫీ పేరుతో వంచించిన చంద్రబాబు
వలసలకు విరుగుడు ఏది..!
హైదరాబాద్: వ్యవసాయం గిట్టుబాటు గాక రాయలసీమలో రైతాంగం అల్లాడిపోతోంది. రుణమాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసం.. రైతన్నను తీవ్రంగా కష్టాల్లోకి నెట్టేసింది. ఒక్క అనంతపురం జిల్లాలోనే ఈ 15 నెలల కాలంలో 103 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు.
చంద్రబాబు మోసం
రుణమాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసానికి రాష్ట్ర రైతాంగం పూర్తిగా బలై పోయింది. అన్ని రకాల అప్పుల్నీ తాము తీర్చేస్తామంటూ ఎన్నికల ముందు నమ్మ బలికిన చంద్రబాబు.. తర్వాత కాలంలో ముఖం చాటేశారు. అటు రుణ మాఫీ కాక, ఇటు కొత్త అప్పులు పుట్టక రుణాల ఊబిలో కూరుకొని పోయారు. అటు ప్రకృతి కూడా కలిసి రాకపోవటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వ్యవసాయం పనులు లేక కూలీలు వలస బాట పట్టారు.
ఒక్క అనంతలోనే 103 ఆత్మహత్యలు
అప్పుల బాధ తట్టుకోలేక అనంతపురం జిల్లాలో రైతులు ఆత్మహత్యల బాట పడుతున్నారు. గడచిన 15 నెలల్లో 103 మంది రైతులు తనువు చాలించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సింగపూర్ కు చక్కర్లు కొట్టడం తప్ప రైతుల కోసం ఆలోచించిన పాపాన పోలేదు. రాజధాని, హై టెక్ కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. దీంతో అనంతపురం వంటి చోట్ల సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి చొరవ కనిపించటం లేదు. కనీసం కొంత కాలం తర్వాత అయినా పరిస్థితులు చక్క బడతాయన్న ఆశ కల్పించ లేక పోయారు.