కళ్లకు కనిపించదా చంద్రబాబూ..

29 Apr, 2016 18:17 IST

() కరువు, తాగునీటి ఎద్దడిని పట్టించుకోని ప్రభుత్వం

() జిల్లాల వారీ సమీక్షలు మాయం

() నోరెత్తని ప్రభుత్వంపై పోరాటం

విజయవాడ) కరువు, తాగునీటి ఎద్దడి విలయ తాండవం చేస్తున్నాయి. గ్రామాలకు గ్రామాలే అల్లాడిపోతున్నాయి. పట్టణ ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అయినా సరే, చంద్రబాబు ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదు.

తీవ్రమవుతున్న సమస్య

చంద్రబాబు, కరువు కవల పిల్లలు అన్న సంగతి అందరికీ తెలిసినదే. అందుకే చంద్రబాబు పదవిలోకి వస్తూండగానే కరువు పిలవకుండా వచ్చేసింది. రెండేళ్లుగా కదలకుండా తిష్ట వేసుకొని కూర్చొంది. ఈ సారి వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. తాగునీటి సమస్య అల్లాడిస్తోంది. అనేక చోట్ల తాగునీరు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం నుంచి తాగునీటి సరఫరా జరగక వాటర్ మాఫియా విజ్రంభిస్తోంది. అటువంటి సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం మాత్రం ఆ పని చేయటం లేదు.

జిల్లాల వారీగా సమీక్షలు ఏవి

వాస్తవానికి అంతర్గతంగా ప్రజాస్వామ్యాన్ని పెంచటానికి జిల్లాల వారీగా సమీక్షలు జరిగేవి. వీటిని జిల్లా సమీక్ష మండలి సమావేశం అని పిలిచేవారు. వీటికి జిల్లా ఇన్ చార్జి మంత్రి అద్యక్షత వహించేవారు. జిల్లా కలెక్టర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ నాయకులు సభ్యులుగా ఉండేవారు. మూడు నెలలకోసారి సమావేశాలు జరిపేవారు. వీటిని మినీ అసెంబ్లీలుగా పిలిచేవారు. ఇందులో ఆయా జిల్లాల్లోని సమస్యలు సమీక్ష జరిపి, పరిష్కారాల కోసం ఆదేశాలు ఇచ్చేవారు.

అరాచకం తప్ప పరిపాలన ఏది

జిల్లాల్లో ఇప్పుడు అరాచకాలు తప్ప పరిపాలన ఆనవాళ్లు కనిపించటం లేదు. దీంతో ప్రజల సమస్యల్ని పట్టించుకొనే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో సమీక్ష మండలి సమావేశం ఏర్పాటు చేస్తే ప్రతిపక్షాలు అరాచకాల మీద నిలదీస్తాయన్న భయం పట్టుకొంది. అందుకే ఎక్కడా సమీక్ష సమావేశాలు నిర్వహించటం లేదు. దీంతో ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతను గుర్తు చేయటానికి బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ చొరవ తీసుకొంది. కరువు, తాగునీటి ఎద్దడి సమస్యల మీద పోరాడేందుకు నడుం కట్టింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరు బాట పడుతోంది.