ప్రత్యేక హోదా మీద పోరులో భాగమే బంద్ పిలుపు
() ప్రత్యేక హోదా మీద నిరంతర పోరాటం
() కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దొంగాట మీద పోరు బాట
() మంగళవారం బంద్ నకు పార్టీ పిలుపు
హైదరాబాద్) ప్రత్యేక హోదా మీద తెలుగుదేశం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి కొంప ముంచేట్లుగా ఉంది. బాధ్యతగల రాష్ట్ర ప్రభుత్వంగా ప్రజల తరపున ఏమాత్రం ప్రశ్నించటం లేదు. దీంతో కేంద్రం కూడా దీన్ని అటక ఎక్కించేస్తోంది. అంతిమంగా ప్రజలు నష్టపోతుండటంతో ప్రజల తరపున వైయస్సార్సీపీ నిలదీస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా బంద్ నకు పిలుపు ఇచ్చింది.
హోదా మాట నానుతూనే ఉంది.
విభజన సమయంలో అప్పటి ప్రధానమంత్రి పార్లమెంటులో ఒక హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు అయిదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాం అని వెల్లడించారు.కాదు పదేళ్లు కావాలని బీజేపీ డిమాండ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే అయిదేళ్ళు కాదు - పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాం అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పార్టీ స్పష్టం చేసింది. చంద్రబాబు నాయుడు కూడా అయిదేళ్ళు చాలదు - పదేళ్ళు కావాలని ఎన్నికలకు ముందు - తరువాత చెప్పాడు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి రాష్ట్రాన్ని విభజించేందుకు పార్లమెంటులో ఇచ్చిన హామీకే దిక్కులేట్టయితే... ఇక పార్లమెంటుకు విశ్వసనీయత ఏముంటుంది?ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కంటే తన ముఖ్యమంత్రి హోదా ఊడకుండా చూసుకోవటం ముఖ్యమయింది. అందుకే ఓటుకి కోట్లు కేసు నుంచి బయట పడేందుకు అయిదు కోట్ల ప్రజలు, వారి పిల్లలు, భవిష్యత్తు తరాల ప్రయోజనాలన్నింటినీ తాకట్టుపెట్టిన విధంగా ఢిల్లీ వెళ్ళి మరీ... ప్రత్యేక హోదా సంజీవని కాదు అంటూ దుర్మార్గమైన ప్రకటన చేశారు. ఇప్పుడు కూడా హోదా డిమాండ్ ను నీరుకారుస్తున్నారు.
పార్లమెంటు సాక్షిగా తేలిపోయిన వాస్తవం
ఇంతటి తీవ్రమైన డిమాండ్ ను తెలుగు ప్రజల తరపున వైయస్సార్సీపీ నిరంతరాయంగా వినిపిస్తోంది. పార్లమెంటులో దీని మీద స్పష్టంగా పార్టీ ఎంపీలు వినిపించారు. దీని మీద కేంద్రం తరపున మాట్లాడిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తమ వైఖరిని బయట పెట్టేశారు. ఇప్పటికిప్పుడు హోదా ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పేశారు. అందుకు బదులుగా తాము చేస్తున్న పనుల్నీ ఒక్కొక్కటిగా వివరించి చెప్పారు.
పోరుబాటలో వైయస్సార్సీపీ
మొదట నుంచీ ప్రత్యేక హోదా మీద పోరాడుతూ వస్తున్నది వైయస్సార్సీపీ. ప్రజల కోసం , ప్రజల తరపున పోరుబాట సాగిస్తోంది. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఢిల్లీ వెళ్లి దీక్ష చేసి జాతీయ నాయకులకు దీని అవసరాన్ని తెలియ చెప్పారు. అనేక సార్లు కేంద్ర పెద్దలతో భేటీ అయి హోదా మీద ఒప్పించేందుకు ప్రయత్నించారు. గుంటూరు వేదికగా నిరవధిక దీక్ష చేసి పోరుబాటను ఉధ్రతం చేశారు. యువభేరి ద్వారా వివిధ నగరాల్లో యువతను చైతన్య పరిచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దొంగాటకు నిరసనగా మంగళవారం బంద్ నకు పిలుపు ఇచ్చారు.