ఆరోగ్యసేవలకు అడ్డంకిగా చంద్రబాబు

16 Dec, 2018 13:56 IST

సీఏం రమేష్ స్టీలుప్లాంటు వెయిట్ లాసు దీక్షకు రోజుకు అక్షరాలా కోటి ఖర్చు అయ్యింది.బాబుగారి ధర్మపోరాట దీక్షకు ఒక్కో సభకూ 4 కోట్లు ఖర్చు అవుతోంది. అంటే 13 జిల్లాలకూ కలిపి 52 కోట్లు. జలహారతి కోసం కోట్ల రూపాయిల నిధులు హారతి కర్పూరంలా కరగబెట్టారు. ప్రత్యేక విమానాలు, విందులూ వినోదాలు, విదేశీ ప్రయాణాలు, లగ్జరీ బస్సులు ఒక్కటేమిటీ బాబుగారు కదిలితే కోట్లు ఖర్చు అయిపోతుంటాయి. ఇన్ని వేల కోట్లు దుబారా చేస్తూ దేశంలోనే నెంబర్ వన్ డాబు బాబుగా పేరు కూడా తెచ్చుకున్నాడు చంద్రబాబు.

ఇలా బడాయి బాబుగారు వేల కోట్లు వ్యర్థం గా తగలేస్తారు కానీ, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఖర్చు పెట్టడానికి ఖజానా ఖాళీ అని బీద ఏడుపులు మొదలెడతారు. డాబుసరి బాబుగారి పాలనలో కేవలం 500 కోట్ల రూపాయిల బకాయిలు కట్టకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రుల అసోసియేషన్ వైద్యసేవలను నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. నగదు రహిత వైద్య సేవల్లో ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్య రక్ష ఉన్నాయి. ఉద్యోగులు, జర్నలిస్టులు, పదవీ విరమణ పొందిన ప్రభుత్వోద్యోగులకు ఇచ్చే బీమా వైద్య సేవలు అన్నిటినీ నిలిపేస్తున్నట్టు ఎపి హాస్పిటల్స్ అసోసియేషన్ తెలియజేస్తోంది. సోమవారం నుండి అంటే డిసెంబర్ 17 నుంచీ ఈ నిర్ణయం అమలు లోకి వస్తుందట. ఎన్టీఆర్ వైద్యసేవల్లో భాగంగా అందించే చికిత్సలకు 450 ఆసుపత్రులకు 500 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నా ఇంతవరకూ చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా, చెల్లించకపోతే నెల రోజుల్లో సేవలు నిలిపివేస్తామని చెప్పినా ప్రభుత్వం స్పందించలేదని అందుకే రేపటి నుండి అత్యవసర సేవలు తప్పించి మిగిలినవన్నీ ఆపేస్తున్నట్టు తెలిపారు.

అసలే నగదురహిత వైద్యసేవల్లో చాలా వ్యాధులకు కవరేజ్ లేకపోగా, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అందించే సేవల్లో భారీ కోతలు విధించారు. ఇచ్చే అరకొర కవరేజిలోనూ సవాలక్ష కొర్రీలుంటాయి. చివరకు అలా దక్కే చికిత్సలను కూడా ప్రజలకు అందకుండా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నగదు రహిత చికిత్సలను అందించే ఆసుపత్రులకు ఇంత వరకూ బిల్లులు చెల్లించకపోవడంతో వారు బీమా ఉన్న ఉద్యోగులకు చికిత్స అందించమని భీష్మించుకున్నారు. ఓ పక్క ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి, ఎన్టీఆర్ పేరుతో అందిస్తున్న ఆరోగ్య బీమాను కూడా అలక్ష్యం చేస్తున్న చంద్రబాబు తీరును చూసి ప్రజలు ఆగ్రహిస్తున్నారు. పేద, మధ్యతరగతి అని తేడా లేకుండా ఎందరికో ఆరోగ్యశ్రీద్వారా ప్రాణదానం చేసిన వైఎస్సార్ మహనీయుడని నాటి రోజులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వెయ్యి దాటిన ప్రతి వైద్యాన్నీ ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చి, దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పిస్తానంటూ మాటిస్తున్న వైఎస్ జగన్ స్ఫూర్తిని కొనియాడుతున్నారు.