అనంతపురం: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మోసం చేసి మహిళా ద్రోహిగా నిలిచారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ మండిపడ్డారు. నియోజకవర్గంలో ఆమె గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఉషాశ్రీ చరణ్కు ప్రజలు ఘన స్వాగతం పలికి, తమ సమస్యలు చెప్పుకున్నారు. ఇంటింటా పర్యటించిన ఆమె ప్రజల కష్టాలు తెలుసుకుంటూ, వారి కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై, ప్రజలపై టీడీపీ గుండాలు దాడులకు తెగబడటం దుర్మార్గమన్నారు. వీరి అరాచకాలకు త్వరలోనే చరమగీతం పాడుతారని హెచ్చరించారు.