ప్రజలను నట్టేటా ముంచాడుఎన్నికలకు ముందు అమలుగానీ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన బాబు...ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను నట్టేటా ముంచాడని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాబ్యాలెట్లో చంద్రబాబుకు వందకు ఒక్క మార్కు కూడా రావడం లేదన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ కనుమరుగవుతుందని చెప్పారు.
మా ఓటు వైయస్ జగన్ కే
అయ్యా ఈ సారి మా ఓటు జగన్కే వేస్తాం... వేరే చెప్పనక్కరలేదు. ఇప్పుడు పడుతున్న బాధలు చాలు.. బాబును నమ్మి ఓటేస్తే... నట్టేట ముంచాడని బట్టువారిపల్లె గ్రామానికి చెందిన రైతు మల్లయ్య అన్నాడు. గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా కారంపూడి మండలం బట్టువారిపల్లె, ఇనుపరాజుపల్లె గ్రామాల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాబ్యాలెట్ను ప్రజలకు అందించి చంద్రబాబు వాగ్ధానాలు అమలు అవుతున్నాయా..? అని ప్రశ్నించారు. దానికి ప్రజలు లేదని బదులిచ్చారు.
పక్కాగృహం, పింఛన్ కోసం పడిగాపులు
టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా పక్కా గృహం గానీ, పింఛన్ గానీ ఇంతవరకు మంజూరు కాలేదని రాచపల్లి గ్రామానికి చెందిన చెంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి ఓటేసి మోసపోయానని వాపోయాడు. కడప జిల్లా పుల్లంపేట మండలంలోని రాచపల్లి, బలిజపల్లె, ఎన్టీఆర్ కాలనీ, తిమ్మారెడ్డిపల్లెలో వైయస్సార్సీపీ రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....బాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ఆయా గ్రామల ప్రజలకు ప్రజాబ్యాలెట్ అందజేశారు. మార్కులు వేయాలని కోరారు.
హామీల అమలులో చంద్రబాబు విఫలం
హామీల అమలులో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబును గద్దెదింపుదామని పుష్పశ్రీవాణి ప్రజలకు పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలోని నీలకంఠాపురం, ధర్మలక్ష్మీపురం గిరిజన గ్రామాల్లో గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికీ వెళ్లి ప్రజాబ్యాలెట్ను అందజేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరాయా..? అని అడిగారు. బాబుకు ఒక్క మార్కు కూడా పడలేదు.
గిరిజనుల సమస్యలను గాలికొదిలేశారు
టీడీపీ రెండేళ్ల పాలనలో ఏనాడూ తమను పట్టించుకోలేదని అచ్చెపువలస, ఎస్.గోపాలపురం గిరిజనులు పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి వద్ద తమ ఆవేదనను చెప్పుకున్నారు. అంత్యోదయ కార్డులు రద్దయిపోయాయని, ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు రాలేదని, ఉపాధి పనులు కల్పించడం లేదని ప్రజలు ఎమ్మెల్యే ఎదుట వాపోయారు.