పేద ప్రజలకు భరోసా ‘నవరత్నాలు’

31 Aug, 2017 17:36 IST
–సెప్టెంబర్‌ 2న నవరత్నాల సభను విజయవంతం చేయండి
–మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
ధర్మవరంటౌన్: పేద ప్రజలకు భరోసానిచ్చేందుకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పేరుతో 9హామీలను ఇవ్వడం జరిగిందని ఆ హామీలను ప్రజలకు వివరించేందుకు సెప్టెంబర్‌ 2వ తేదీన ధర్మవరం పట్టణలలో నవరత్నాల సభను నిర్వహించడం జరుగుతోందని, ఈ కార్యక్రమానికి ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ సర్కార్‌ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అవినీతి, అక్రమార్జనే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వ యంత్రాగాన్ని, పోలీస్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ బాబు చేస్తున్న పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. సెప్టెంబర్‌ 2వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్‌ వర్ధంతి రోజున ధర్మవరం పట్టణంలోని శ్రీదేవి థియేటర్‌ నందు నవరత్నాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు హాజరై నవరత్నాల హామీలను ప్రజలకు, కార్యకర్తలకు వివరిస్తారన్నారు. రైతులు, మహిళలు, చేనేతలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా నవరత్నాల హామీలు రూపొందించడం జరిగిందన్నారు. నవరత్నాల సభకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అనుభంద సంఘాలు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.