ప్రకాశం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇంత వరకు ఒక్కరికైనా ఇల్లు కట్టించారా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి ప్రశ్నించారు. జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం కొనసాగుతోంది. గిద్దలూరు మండలం కొత్తకోట గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తమకు రుణాలు మాఫీ కాలేదని, పింఛన్లు అందడం లేదని, రేషన్కార్డులుమంజూరు కాలేదని ఇలా తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం ఐవీ రెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని మండిపడ్డారు. పేదలకు ఇల్లు కట్టించేందుకు డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు హైదరాబాద్లో వందల కోట్లతో విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారని ఆరోపించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం వైయస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని, మరో రెండేళ్లలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు.