అభివృద్ధి, సంక్షేమం మర్చిపోయిన చంద్రబాబు
17 Jun, 2017 12:29 IST
శ్రీకాకుళంః అభివృద్ధి, సంక్షేమం అనే అంశాలను మర్చిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో దోపిడీ, అరాచక, అవినీతి పరిపాలన కొనసాగిస్తున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి విమర్శించారు. పలాస నియోజకవర్గ పరిధిలోని వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేట, దిబ్బవానిపేట గ్రామాల్లో నియోజకవర్గ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు అధ్యక్షతన రెెండవ రోజు గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెడ్డిశాంతి ముఖ్యఅతిథిగా హాజరై గ్రామాల్లో కలియదిరిగారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు మూడేళ్ల పరిపాలనంతా దోపిడీమయమని ఆరోపించారు. మూడేళ్లుగా ప్రజలకు చేసిన ఒక్క మంచి కార్యక్రమం కూడా లేదన్నారు. అబద్ధపు హామీలిచ్చి రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశాడని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.