శ్రీకాకుళంః చంద్రబాబు పరిపాలన అంతా అవినీతి మయంగా తయారైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. జన్మభూమి కమిటీల వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదని ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం సారవకోట మండలం చీడిపూడి గ్రామ పంచాయతీలో ధర్మాన కృష్ణదాస్ గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పరిపాలనపై ప్రజల చేత మార్కులు వేయించారు. ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారం చేపట్టిన తరువాత వాటిని అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే ప్రజా సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు.