అమరావతి: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వద్దకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఉన్నతస్థాయి బృందం సోమవారం వెళ్లింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలుబడింది. ఇటీవల కరుణానిధి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వైయస్ఆర్సీపీ ఉన్నతస్థాయి బృందాన్ని తమిళనాడుకు పంపించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. దీంతో పార్టీ తరఫున సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డిలతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం చెన్నైకి బయలుదేరారు. వారు కరుణానిధిని కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని పరామర్శిస్తారు.