విజయవాడ: ప్రత్యేక హోదా కోసం ఈ నెల 20న అఖిలపక్షం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని వైయస్ఆర్సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు అన్నారు. చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో అఖిలపక్షం నేతలతో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వైయస్ఆర్సీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. విభజన హామీలపై చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారని మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసు కోసమే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. లోటు బడ్జెట్ను అడగలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ అనేక పోరాటాలు చేసింది. వైయస్ జగన్మోహన్రెడ్డి యువభేరీలు నిర్వహించారని వారు తెలిపారు.