హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సూచించారు. రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి టీడీపీ ఎంపీలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హోదాపై చంద్రబాబు రోజుకో రకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓటుకు కోట్ల కేసు భయంతో నాలుగేళ్లుగా కేంద్రానికి ప్రత్యేక హోదాను, విభజన చట్టంలోని అంశాలను తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. ఇప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి పోరాటం ఉధృతం చేయడంతో చంద్రబాబు ఊసరవెల్లి రంగులు మార్చినట్లు.. మాటలు మార్చుతున్నాడన్నారు. అర్థరాత్రి ప్యాకేజీని స్వాగతించిన చంద్రబాబు.. ఇన్నాళ్లూ కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉందంటూ డబ్బాలు కొట్టుకొని ఇప్పుడు కొత్త డ్రామాలకు తెరలేపారన్నారు. ఇప్పటికైనా బాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే వైయస్ఆర్ సీపీ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని కోరారు.