దగాకోరు బాబును గద్దె దించేవరకు పోరాడుతాం
6 Nov, 2018 15:16 IST
బెదిరింపులకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదు
మీడియాను చేతుల్లో పెట్టుకుంటే సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తాం
టీడీపీ ఫిర్యాదులపై ఉన్న శ్రద్ధ ప్రతిపక్షం ఇచ్చిన కంప్లయింట్లపై లేకపోవడం విడ్డూరం
జోగి రమేష్ను విచారించినట్లే.. కేశినేని నాని, సోమిరెడ్డిలను ఎందుకు పిలవలేదు
అబద్ధాలు మాట్లాడిన డీజీపీ, చంద్రబాబులపై ఎలాంటి కేసు పెట్టారు
2019లో నారాసుర రాజకీయ వధ జరగడం ఖాయం
ప్రజా సంకల్పయాత్రతో వైయస్ జగన్ వరల్డ్ రికార్డు సృష్టించారు
విజయవాడ: దగాకోరు ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడుతామని, చంద్రబాబు మీడియాను ఎంత మేనేజ్ చేసినా సోషల్ మీడియా అనే అస్త్రంతో బండారాలు బయటపెడతామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్బాబు అన్నారు. వైయస్ఆర్ సీపీ జెండాకు భయం, వణుకు ఉండదని, పోలీసులతో బెదిరింపులకు గురిచేసినా వెనుకంజ వేసే ప్రసక్తే లేదని, ఇది టీడీపీ నేతలు రాసిపెట్టుకోవాలని సూచించారు. టీడీపీ నాయకుడు వర్ల రామయ్య ఇచ్చిన ఫిర్యాదుతో ఆఘమేఘాల మీద వైయస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు జోగి రమేష్ను పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారిస్తున్న పోలీసులు అదే చంద్రబాబు పార్టీ నేతలపై ఇచ్చిన ఫిర్యాదులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రరాష్ట్రంలో బలహీనవర్గాలు, దళితులపై రాజకీయంగా దాడులు ఏ విధంగా జరుగుతున్నాయో జోగి రమేష్ విచారణ నిదర్శనమన్నారు. ఈ మేరకు విజయవాడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మీద హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగి ఉన్నాడని సోషల్ మీడియాలో వస్తుందని ప్రెస్మీట్లో జోగి రమేష్ చెప్పారని, దాన్ని ఆధారంగా చేసుకొని వర్ల రామయ్య గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంలో పోలీసులు హడావుడి చేస్తూ జోగి రమేష్ను పిలిపించి విచారిస్తున్నారన్నారు.
వైయస్ జగన్పై విశాఖపట్నం ఎయిర్పోర్టులో హత్యాయత్నం జరిగిన కొద్ది సేపటికీ ప్రెస్మీట్ పెట్టి సానుభూతి కోసం పబ్లిసిటీ స్టంట్ జరిగిందన్న డీజీపీ ఠాకూరుపై ఏం కేసు పెట్టారో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మీడియా ముందుకు వచ్చి వైయస్ఆర్ సీపీ అభిమానితో దాడి చేయించుకున్నారని, ఇదంతా డ్రామా అన్న చంద్రబాబుపై, ప్రతిపక్షనేతను కైమా కైమా కొట్టేవాళ్ల అన్న టీడీపీ ఎంపీ కేశినేని నాని, గిల్లుకోవడం.. గిచ్చుకోవడం ఉండదు.. మేము అనుకుంటే ఏమైనా చేయగలం అన్న సోమిరెడ్డిపై, ప్రతిపక్ష నేత కావాలని పొడిపించుకున్నారన్న పరిటాల సునీతపై ఎలాంటి కేసులు నమోదు చేశారో చెప్పాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఒరవడిని, ఏపీలో జరుగుతున్న రాజకీయ క్రీడను రాష్ట్ర ప్రజానీకం దయచేసి గమనించాలని కోరారు.
ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యల ఆధారంగా వైయస్ఆర్ సీపీ నాయకులు పోలీస్ స్టేషన్లలో కంప్లయింట్లు ఇస్తే కనీసం వారిలో ఒక్కరిని కూడా విచారించిన పాపానపోలేదన్నారు. పెయిడ్ ఆర్టిస్టు శివాజీ గరుడ పురాణాన్ని పదే పదే చెబుతున్నా.. ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరుగుతుందని తనకు తెలుసని, మళ్లీ జరుగుతుందని చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా అతనిపై కేసులు నమోదైనా కనీసం అదుపులోకి తీసుకొని విచారించకపోవడం ఆంతర్యమేంటని ప్రశ్నించారు. గరుడ పురాణం ఎక్కడ రచించబడిందో పెయిడ్ ఆర్టిస్టు శివాజీకి అ ంతా తెలుసని చెప్పినా అరెస్టు చేయలేదంటే చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై ఉన్న గౌరవం ఇట్టే అర్థం అవుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి దేశంలో ప్రజాస్వామ్యం కుంటుపడిందని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బడుగు, బలహీనవర్గాలు, దళితులు, మైనార్టీలు ఇలా అనేక మంది వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలను వందలాది మందిని అక్రమంగా అరెస్టులు చేసి చిత్రహింసలకు గురిచేశారన్నారు. ఇటీవల తొమ్మిది మందిని అరెస్టు చేశారన్నారు.
దుష్ట అహంకార రాజకీయ కుట్రను కడిగివేయడానికి సోషల్ మీడియా ద్వారా వైయస్ఆర్ సీపీ నాయకుల భావాలను అణచివేయాలని చంద్రబాబు అనుకుంటే కుదరదని, మా ఉద్వేగం, ఆలోచన చంద్రబాబు మోసాల నుంచే పుట్టాయని సుధాకర్బాబు చెప్పారు. చంద్రబాబు రంగు బయటపడడంతో వైయస్ఆర్ సీపీ కార్యకర్తలతో పాటు యువత కూడా ప్రశ్నిస్తుందన్నారు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, బాబు వస్తే జాబు ఏమయ్యాయని ప్రశ్నించారు. విశాఖలో వందల కోట్లు ఖర్చు చేసి పాట్నర్షిప్ సమ్మిట్లు పెట్టి చిల్లి గవ్వ కూడా పెట్టుబడులు తీసుకురాలేని అసమర్థ పాలన అని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా బెదిరిపోమని, మేము ఎత్తుకున్న జెండా, మా ఎజెండా వైయస్ఆర్ అనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. దగాకోరు ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యమన్నారు.
నారాసుర రాజకీయ వధ 2019 ఎన్నికల్లో జరుగబోతుందని, అందుకు ప్రజలు కంకణం కట్టుకొని కూర్చున్నారన్నారు. బీసీ నాయకుడు జోగి రమేష్ను స్టేషన్కు పిలిచి అవమానించారని, వైయస్ఆర్ సీపీ పెట్టిన కేసులపై కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షనేత వైయస్ జగన్పై హత్యాయత్నం జరిగితే ఈ రోజు వరకు రాష్ట్ర ప్రజానికానికి కేసు విషయంలో సరైన సమాచారం ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలిస్తుందన్నారు. వైయస్ జగన్ను హతమార్చాలని గరుడ పురాణాన్ని రచించిన సూత్రధారులు ఎవరో ఇప్పటికీ కనిపెట్టలేకపోయారన్నారు.
2017 నవంబర్ 6న సరిగ్గా ఏడాది క్రితం జగన్నాథ రథచక్రాలు ఇడుపులపాయ నుంచి మొదలై ఇచ్ఛాపురం వైపు వెళ్తున్నాయని సుధాకర్బాబు అన్నారు. రథచక్రాల శబ్దానికి చంద్రబాబుకు వణుకు మొదలైందని, వైయస్ జగన్ వేసే అడుగు రాష్ట్రాన్ని మోసం చేసిన చంద్రబాబు గుండెలపై పడుతుందన్నారు. మోసపోయి తిరగబడిన ప్రజల అడుగు. రాజన్న రాజ్యం మళ్లీ చూడాలని, కోట్లాది ఆశల అడుగులై వైయస్ జగన్ వెంట నడుస్తున్నాయన్నారు. ప్రజల కోసం 32 వందల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి వైయస్ జగన్ వరల్డ్ రికార్డు సృష్టించారన్నారు. ప్రజాప్రస్థానం పేరుతో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి మండుటెండలో పాదయాత్ర చేసి రామరాజ్య తీసుకొచ్చారన్నారు. వైయస్ఆర్ పాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిందని, పేదవాడికి సంపూర్ణ ఆరోగ్యం, రైతుకు రుణమాఫీ, విద్యార్థులకు ఉన్నత చదువులు అందరినీ కన్నబిడ్డల్లా చూసుకున్నారన్నారు. అలాంటి పాలన రావాలని ప్రజలంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని, ఎన్నికల్లో వైయస్ జగన్ను గెలిపించాలనే సంకల్పంతో ఉన్నారన్నారు.
పవన్ కల్యాణ్ పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం కావని మాట్లాడడం విడ్డూరంగా ఉందని సుధాకర్బాబు అన్నారు. ప్రశ్నించేందుకు పార్టీ అని చెప్పిన పవన్ రంగాను చంపిన తెలుగుదేశం పార్టీతో జతకట్టి చంద్రబాబు మాయలో పడ్డారని, 22 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసినా ప్రశ్నించలేకపోయాడన్నారు. పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు చిరంజీవి అన్న గౌరవం ఉందని, అవినీతి, వారసత్వం అనే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. అవినీతి, వారసత్వం పవన్ వచ్చిన సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఉన్నాయన్నారు.