ఆదాలకు అసలు జ్ఞానం ఉందా?
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వకపోవడం వల్లే రాజ్యసభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని చెబుతున్న ఆదాల ప్రభాకర్రెడ్డికి అసలు బుద్ధీ, జ్ఞానం ఉన్నాయా అని వైయస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. వైయస్ఆర్సీపీకి రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకునేంతటి బలం లేనందున ఎన్నికలకు దూరంగా ఉంటామని తమ పార్టీ సీజీసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి జనవరి 23నే స్పష్టం చేశారని, ఆదాల తన నామినేషన్ దాఖలు చేసింది 28న అని ఆమె గుర్తుచేశారు.
ఇంత స్పష్టంగా తమ పార్టీ చెప్పిన తర్వాత కూడా తమను నమ్ముకుని నామినేషన్ వేశానని ఆదాల చెప్పడం సిగ్గులేని, నీతిమాలిన చర్య అని దుయ్యబట్టారు. తమ పార్టీపై బురద జల్లాలనే ప్రయత్నమే ఇందులో కనిపిస్తోందన్నారు. ఎవరి స్ర్కిప్టు ప్రకారం వైయస్ఆర్సీపీపై విమర్శలు చేస్తున్నారో కూడా తమకు తెలుసని పద్మ అన్నారు. మన రాష్ట్రం కలిసి ఉంటే శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి గెలవరని జేసీ దివాకర్రెడ్డి చెబుతున్నవి పిచ్చి మాటలన్నారు. రాష్ట్రం కలిసి ఉన్నపుడే కడప నుంచి శ్రీ వైయస్ జగన్ ఐదు లక్షల పైచిలుకు భారీ ఆధిక్యతతో గెలుపొందిన వాస్తవం విస్మరించారా, 17 ఎమ్మెల్యే స్థానాలను గెల్చుకున్న విషయం మరిచారా అని ఆమె ప్రశ్నించారు.