- మనందరి ప్రభుత్వంలో రైతుకు భరోసా
- పెట్టుబడుల కోసం ఏడాదికి రూ.12,500
- వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ రద్దు.
- సహకారరంగం పునరుద్ధరణ
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వైయస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా తోడుగా ఉంటామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ భీమిలి నియోజకవర్గంలో తనను కలిసిన రైతులకు వైయస్ఆర్ రైతు భరోసా గురించి వివరించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రైతులకు ఎంతో మేలు చేశారన్నారు. ఆయన చనిపోయాక రైతులను పట్టించుకోవడం మానేశారన్నారు. మనందరి ప్రభుత్వం వచ్చాక రైతులకు తోడుగా ఉండేందుకు, రైతు ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు నవరత్నాల్లో రైతు భరోసా పథకం రైతులకు పునర్జన్మలాంటిదన్నారు. వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలు, పెట్టుబడి కోసం రూ.12,500 సమకూర్చడం, ఉచితంగా బోర్లు వేయిస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ కరెంటు, రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, శీతలీకరణ గిడ్డంగుల ఏర్పాటు, పాడి రైతులకు లీటరుకు రూ.నాలుగు సబ్సిడీ, వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ రద్దు, రూ.4000 కోట్లతో ప్రకృతి, విపత్తుల సహాయక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, ఈ మొత్తాన్ని అప్పులు ఇచ్చిన వారు లాక్కోకుండా ప్రత్యేక చట్టం తెస్తామనడం.. ఇవన్నీ నిజంగా రైతులకు సంజీవినే అన్నారు. వ్యవసాయ ట్రాక్టర్లపై రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తామని, సహకార రంగాన్ని పునరుద్ధరిస్తామన్నారు. సహకార డెయిరీకి పాలుపోసే పాడి రైతుకు లీటరుకు రూ. 4 సబ్సిడీ ఇస్తామని మాట ఇచ్చారు. వైయస్ జగన్ హామీపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.