నవంబర్ 26ను పండుగలా నిర్వహిస్తాం

21 Nov, 2015 16:48 IST
రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల పాలన
రాష్ట్ర చరిత్రలోనే పునాదిరాయిగా గుంటూరు సభ

గుంటూరుః భారత రాజ్యాంగానికి విఘాతం కలిగే రీతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన సాగిస్తున్నాయని వైఎస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. చట్టాలను అతిక్రమించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన సాగించిన నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమేనని స్పష్టం చేసారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ నాయకత్వంలో ....రాజ్యాంగం ఆమోదించబడిన నవంబర్ 26వ రోజును గుంటూరులో పెద్ద పండగలా నిర్వహిస్తామని గుంటూరులో నేతలు ప్రకటించారు. 

వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో ఈనెల  26న కార్యక్రమం చేపడుతామన్నారు.  ఉదయం 10 గంటలకు గుంటూరు నగరంలోని అంబేద్కర్ స్టాట్యూ నుంచి వెంకటేశ్వర విజ్ఞానమందిరం వరకు ఊరేగింపు నిర్వహించి...అక్కడ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తామన్నారు. అనంతరం విజ్ఞాన మందిరంలో సభ నిర్వహిస్తామన్నారు. బడుగు, బలహీన వర్గాల హక్కులు కాలరాస్తున్న చంద్రబాబు వైఖరిని ఎండగడతామన్నారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో అగ్రవర్ణాల్లోని  పేదలతో పాటు బడుగు, బలహీన వర్గాల వారికి ఎంతో మేలు చేశారని నేతలు కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలతో వైఎస్సార్ పరిపాలన కొనసాగించారని పేర్కొన్నారు. కానీ, చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ దళితులను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేవిధంగా రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును ఘనంగా నిర్వహిస్తామన్నారు.

వైఎస్సార్సీపీ చేపట్టే కార్యక్రమాన్ని దళితులకు సంబంధించిన కార్యక్రమంలా కాకుండా ప్రతి ఒక్కరికీ సంబంధించిన కార్యక్రమంగా భావిస్తున్నామన్నారు. అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లడం కోసం రేపు జరగబోయే సభ రాష్ట్ర చరిత్రలోనే పునాదిరాయిగా నిలుస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న విధానాన్ని విడనాడాలని హితవు పలికారు. లేనిపక్షంలో ఈనెల  26 నుంచే ఇరు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.