అడ్డుకునే శక్తి ఒక్క జననేతకే ఉంది..!

12 Nov, 2015 16:17 IST
బాక్సైట్ ను తవ్వితే పాతరేస్తాం..!
రెండు నాల్కల ధోరణి..!

విశాఖపట్నంః చంద్రబాబు సర్కార్ నిరంకుశ పాలనపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం దుర్మార్గమని అరకు ఎమ్మెల్యే సర్వేశ్వర్ రావు మండిపడ్డారు. తినడానికి తిండిలేక, తాగడానికి సరైన నీరు లేక గిరిజనులు వ్యాధులతోమరణిస్తున్నా పట్టించుకోకుండా....వారేమైపోయినా  పర్వాలేదన్న రీతలో చంద్రబాబు పాలన సాగించడం దౌర్భాగ్యమని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడో విధంగా, అధికారంలోకి వచ్చాక మరో విధంగా చంద్రబాబు రెండు నాల్కల ధోరణి ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు.

బాక్సైట్ తవ్వకాలు జరపవద్దంటూ గతంలో నీవు చేసిన ధర్నాలు, గవర్నర్ కు రాసిన లేఖలు గుర్తుకులేదా అని సర్వేశ్వర్ రావు చంద్రబాబును నిలదీశారు.  బాక్సైట్ ను వెలికితీస్తే ఆదిమజాతి అంతరించిపోతుందని సర్వేశ్వర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. బాక్సైట్ గురించి గిరిజనులు మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారని, బ్రిటీష్ వాళ్లనే తరిమికొట్టిన చరిత్ర ఉందని అన్నారు. బాక్సైట్ తవ్వకాలు జరిపేందుకు ఎవరు వచ్చినా పాతరేస్తామన్నారు. గిరిజనులకు అండగా వైఎస్సార్సీపీ ఎంతదాకైనా పోరాడుతుందని సర్వేశ్వర్ రావు స్పష్టం చేశారు. 

జననేత సారథ్యంలో మహోద్యమం..!
గిరిజనుల మనోభావాలను దెబ్బతీస్తూ చంద్రబాబు మొండివైఖరి అవలంభిస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. లక్షల కోట్లు దోచుకునేందుకే తవ్వకాలకు చంద్రబాబు అనుమతిచ్చాడని పైరయ్యారు. ఆదివాసీల పట్ల ఎందుకంత వివక్ష చూపుతున్నారో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రాణాలు అడ్డుపెట్టైనా బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటామని ఆమె తేల్చిచెప్పారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకొని ఉద్యమాన్ని ఆటంకం పర్చాలని చూస్తే చంద్రబాబు ఖబడ్దార్ అని ఈశ్వరి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

గిరిజనుల ఆపద్భాందవుడు, పోరాటయోధుడు వైఎస్ జగన్ నాయకత్వంలో పోరాటన్ని ఉధృతం చేస్తామని ఈశ్వరి అన్నారు. బాక్సైట్ తవ్వకాలకు వైఎస్సార్సీపీ పూర్తిగా వ్యతిరేకమన్నారు. త్వరలోనే గిరిజనులకు అండగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చింతపల్లిలో పర్యటిస్తారని ఈశ్వరి  తెలిపారు. బాక్సైట్ తవ్వకాలను ఆపే శక్తి ఒక్క జననేతకు మాత్రమే ఉందన్నారు. గిరిజనుల సమస్యను ప్రపంచమంతా తెలియజెప్పేందుకే...వైఎస్ జగన్ ప్రతిఒక్కరినీ చైతన్యవంతుల్ని చేస్తున్నారన్నారు. ప్రజానీకమంతా గుర్తెరిగి ఈమహోద్యమంలా జననేతకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. జీవోను రద్దు చేసేంతవరకు అందర్నీ కలుపుకొనిపోయి ప్రభుత్వంపై ఉద్యమిస్తామని ఈశ్వరి కుండబద్దలు కొట్టారు.