రాజీనామాలు ఆమోదించాలని కోరాం

29 May, 2018 18:54 IST

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు ఎంపీ పదవులకు రాజీనామా చేశామని, వాటిని ఆమోదించాలని స్పీకర్‌ను కోరినట్లు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సాయంత్రం స్వీకర్‌ సుమిత్రా మహాజన్‌ను వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఐదుగురు కలిశారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని స్పీకర్‌కు  చెప్పామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని స్పీకర్‌ కోరినట్లు చెప్పారు. అయితే తక్షణమే రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు. కర్ణాటకలో ఇద్దరు ఎంపీల రాజీనామాలు ఆమోదించారని, అదేవిధంగా మా రాజీనామాలు కూడా ఆమోదించాలని కోరినట్లు పేర్కొన్నారు. స్పీకర్‌ ఫార్మాట్లోనే రాజీనామాలు చేశామని, ఈ సెషన్‌లో ఆమోదించకపోతే మరో సారి స్పీకర్‌ను కలిసి రాజీనామాలు ఆమోదించుకుంటామని చెప్పారు. రాజీనామాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రాజీనామాలు చే సి ప్రజల్లోకి వెళ్తే ప్రత్యేక హోదాకు బలం చేకూరుతుందని మా నమ్మకమన్నారు. రాజీనామాలు ఆమోదించకపోతే మళ్లీ అడుగుతామని తెలిపారు. ప్రత్యేక హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని, వారు కూడా రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచేది కాదన్నారు. మా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని, వారిపై అనర్హత వేటు పడకుండా కాపాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.