న్యూఢిల్లీ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు తమ పోరాటం ఆగదని వైయస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఐదుకోట్ల ఆంధ్రులకు ప్రత్యేక హోదా సంజీవని అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వేదికగా చేపట్టిన మహాధర్నా కార్యక్రమంలో సుబ్బారెడ్డి మాట్లాడారు. నాగేళ్లుగా ప్రత్యేకహోదా కోసం వైయస్ఆర్సీపీ పోరాటాలు చేస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా బంద్లు, ధర్నాలు, యువభేరీ కార్యక్రమాలు నిర్వహించిందని గుర్తుచేశారు. ప్రత్యేకహోదా కోసం అసెంబ్లీలో కూడా తీర్మానం చేశామన్నారు. గతంలో హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు ఇప్పడు కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. గత నాలుగేళ్లుగా విభజన హామీలు, ప్రత్యేకహోదా కోసం వైయస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్లో అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ వంటి హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకహోదాపై ప్రకటన రాకపోతే మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం పెడతామని ప్రకటించారు. అప్పటికీ కేంద్రం స్పందించకపోతే ఏప్రిల్ 6న రాజీనామాలు చేస్తామని వైవీ స్పష్టం చేశారు.