స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం

22 Dec, 2015 19:05 IST
తెలుగుదేశం సభ్యుడిలా వ్యవహరిస్తున్న కోడెల
సీఎం దగ్గర మార్కులు కొట్టేసేందుకు తాపత్రయం
ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యం
గతంలో హెచ్చరించినా మారని ప్రవర్తన
అవిశ్వాస తీర్మానానికి వైఎస్సార్ సీఎల్పీ ఏకగ్రీవ ఆమోదం

హైదరాబాద్ః ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు వైఎస్సార్ సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రేపు అవిశ్వాస తీర్మానం ఇవ్వాలని నిర్ణయించింది. స్పీకర్ వ్యవహార శైలి శోచనీయమని వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు. సభాపతి పెట్రేగి పోయి తెలుగుదేశం సభ్యుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో కూడా ఇదే పరిస్థితి ఉందని అవిశ్వాస తీర్మాన నోటీసు ఇస్తే..స్పీకర్ తన వ్యవహార శైలి మార్చుకుంటారని ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో ఉపసంహరించుకున్నామన్నారు. 


కాల్ మనీ సెక్స్ రాకెట్ దురాగాతాల్ని నిర్మూలించేందుకు బాధ్యత గల ప్రతిపక్షంగా తమ అధ్యక్షులు వైఎస్ జగన్ ... మహిళల ఇబ్బందులను అర్థం చేసుకొని మహిళా శాసనసభ్యురాలు రోజా చేత మాట్లాడించాలని  ప్రతిపాదించారన్నారు. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పిరికిపందల్లా  అన్యాయంగా సస్పెండ్ చేశారని అధికారపక్షంపై జ్యోతుల నెహ్రూ నిప్పులు చెరిగారు. నిబంధనలకు విరుద్ధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల చెప్పడం ...ఆయన చెప్పిన విధంగా చదువుతూ స్పీకర్ రోజాను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. 

శాసనసభ కాల పరిమితిని దాటి సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు లేదని జ్యోతుల నెహ్రూ అన్నారు. రూల్స్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలని మంత్రి యనమల, సభాపతి కోడెల శివప్రసాదరావులకు తెలియదేమో అని నెహ్రూ ఎద్దేవా చేశారు. తప్పని తెలిసి కూడా అకారణంగా సస్పెండ్ చేశారని నెహ్రూ ఆక్రోశించారు.  అంతకుముందు కూడా సభలో మంత్రి యనమల వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు  ఎమ్మెల్యేలను ఒకరోజు సస్పెండ్ చేయాలని ప్రపోజ్ చేస్తే స్పీకర్ రెండ్రోజులు చేశారని మండిపడ్డారు. బాధ్యతగా ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకోవాల్సిన స్పీకర్ ఏకపక్షంగా  వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. మంత్రివర్గ విస్తరణలో  భాగంగా సీఎం దగ్గర మార్కులు కొట్టేసేందుకే స్పీకర్ అలా వ్యవహరిస్తున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు.   

గతంలో కూడా స్పీకర్ ఇదే వ్యవహార శైలి అవలభిచారని నెహ్రూ అన్నారు. లాస్ట్ సెషన్ లో ప్రతిపక్ష నాయకుడు 40 నిమిషాలు మాట్లాడితే అందులో 17 సార్లు అంతరాయం కలిగించారన్నారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు సంబంధం లేకుండా ఏవేవో మాట్లాడుతున్నా... స్పీకర్ దాన్ని నివారించే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. ఇంత దారుణంగా వ్యహరించిన సభాపతిని తాను ఇంతవరకు చూడలేదని నెహ్రూ విరుచుకుపడ్డారు. 

ప్రజావసరాలకు అనుగుణంగా స్పందించడానికి ...తప్పని పరిస్థితుల్లోనే అవిశ్వాసం తీర్మానం ఇవ్వాలని నిర్ణయించినట్లు నెహ్రూ తెలిపారు. స్పీకర్ పై  అవిశ్వాసం పెడితే ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇదివరకే  ఆయన్ను ఓసారి హెచ్చరించామని, రెండవసారి  భరించామన్నారు. అయినా కూడా స్పీకర్ ప్రవర్తనలో మార్పు లేని కారణంగా అవిశ్వాసం ఇస్తున్నామన్నారు. రోజా సస్పెన్షన్ కు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. చట్టానికి వ్యతిరేకంగా రోజా సస్పెన్షన్ చెల్లనేరదని. దానిపై కూడా పైట్ చేస్తామని స్పష్టం చేశారు.