హైదరాబాద్: అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వైయస్ఆర్సీపీ సరికొత్తగా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన ఆండ్రాయిడ్ స్మార్టు ఫోన్లకు ప్రత్యేకమైన అప్లికేషన్ రూపొందించింది. ఆ పార్టీ ఐటీ విభాగం రూపొందించిన ‘ఓట్ ఫర్ జగన్’ మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ను పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎం.వి. మైసూరారెడ్డి బుధవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ అప్లికేషన్లో పార్టీ మేనిఫెస్టోతో పాటు వైయస్ఆర్సీపీ రూల్సు, పర్యటనల ప్రణాళిక, అభ్యర్థుల ప్రొఫైల్సు, వీడియోలు, రింగ్టోన్లు, వాల్పేపర్లు, సభ్యత్వ నమోదు, ఈవీఎం డెమో, ఫేస్బుక్, సూచనలు, పార్టీని సంప్రదించడం లాంటి మొత్తం 12 అంశాలను పొందుపరిచారు.
ఒకసారి ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుంటే ఇంటర్నెట్ అవసరం లేకుండా పార్టీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకునే వీలుంది. ఫేస్బుక్, వీడియోలు, టూర్ షెడ్యూల్ మినహా మిగతా అంశాలను ఇంటర్నెట్తో సంబంధం లేకుండా ఆపరేట్ చేసుకునే వెసులుబాటు దీనిలో కల్పించారు. ఈ అప్లికేషన్ను అభివృద్ధి చేసిన మాచినేని కిరణ్కుమార్ను మైసూరారెడ్డి అభినందించారు. పార్టీ లక్ష్యాలను మరింత విస్తృతంగా గడప గడపకూ తీసుకెళ్లడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మైసూరా చెప్పారు.
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ర్సీపీ ఐటీ విభాగం రాష్ట్ర కన్వీనర్ చల్లా మధుసూదన్రెడ్డి, నారు మహేష్, దేవేంద్ర, జయరామ్, హర్షవర్ధన్రెడ్డి, కేతు మాల్యాద్రి, గోపినాథ్, ఆదిత్య, బ్రహ్మారెడ్డి, శ్రీవర్ధన్, కోటిరెడ్డి పలువురు ఐటీ నిపుణులు పాల్గొన్నారు.