- నాగార్జున సాగర్ కుడి కాలువ ఆధునీకరణ పనుల్లో కుట్ర– కోడెల కుటుంబంపై సీబీఐ విచారణ చేపట్టాలి
విజయవాడ: నాగార్జున సాగర్ కుడి కాలువ ఆధునీకీకరణ పనుల్లో కుట్ర జరుగుతుందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.గుంటూరు జిల్లాలో కోడెల శివప్రసాదరావు కుటుంబం చేస్తున్న అవినీతి అంతా ఇంత కాదని ధ్వజమెత్తారు. వరల్డ్ బ్యాంకు నుంచి రూ.447 కోట్లు విడుదల అయ్యాయని, 72 ప్యాకేజీల కింద పనులు విభజించి టెండర్లు పిలిచారన్నారు. టెండర్లను కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా టీడీపీ నేతలే చక్రం తిప్పారని విమర్శించారు. టెండర్లో తమ కాంట్రాక్టర్లను పిలిపించుకొని ,వారికి మాత్రమే టెండర్ ఫాం ఇచ్చారన్నారు. వీరింతా ఓ గ్రూప్గా ఏర్పడ్డారని, వారికి మాత్రమే పనులు అప్పగించారన్నారు. రివ్యూ కమిటీకి పంపించకుండా ఈ రోజు పనులు ప్రారంభించారన్నారు. టెండర్లు ఓపెన్ చేయకుండా, అగ్రిమెంట్ పూర్తి కాకుండానే కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడంతో ముందుగానే కాంట్రాక్టర్లకు ఎవరికి ఏ పనులు వచ్చాయో తెలిసిపోయిందన్నారు. ఈ టెండర్ ప్రక్రియను పరిశీలిస్తే ఏ విధంగా టీడీపీ ప్రభుత్వం నీటి పారుదల శాఖలో ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతుంతో అర్థమవుతుందన్నారు. ఈ పనులకు 25 శాతం నుంచి 30 శాతం అదనపు అంచనాలు వేస్తే కనీసం వాటిని ఐఎన్సీకి గాని సీఈ పరిశీలించకుండా ఏవిధంగా పనులు ప్రారంభిస్తారని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కయ్యారని విమర్శించారు. టెండర్లు ఓపెన్ చేయకుండానే పనులు ప్రారంభించడం దుర్మార్గమన్నారు. 50 రోజుల్లో పూర్తి చేయాల్సిన పనులకు రూ.100 కోట్లు కేటాయించారని, ఈ స్కామ్లో స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కాంట్రాక్టర్లతో రింగ్ అయిపోయి ఈ పనులను టెండర్ పూర్తి కాకుండానే ప్రారంభించారన్నారు.
– పశు గ్రాసం కోసం మేత కొనుగోలు చేసే కార్యక్రమంలో దాదాపు 3500 ఎకరాల్లో గడ్డిని సాగు చేసి, వాటిని కొనుగోలు చేయాలని వెటర్నీ డిపార్టుమెంట్ నిర్ణయం తీసుకుంటే..కోడెల కుమారుడు ఈ రోజు తన అనుయాయులకు, తన అనుచరుల పేర్లు దొంగచాటున రాయించారని, ఈ రోజు పశుగ్రాసం పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఎకరానికి రూ.20 వేల చొప్పున దాదాపు రూ.7 కోట్లు ఈ స్కామ్లో ప్రజాధనాన్ని కొల్లగొట్టారని విమర్శించారు. ఎక్కడ పశుగ్రాసం సాగు చేశారు..? ఏ పొలంలో ఉందో ఎవరికి అంతు చిక్కడం లేదన్నారు. సైలేజ్ అనే కొత్త రకమైన మేతను పశువులకు పెట్టి వాటిని మార్కెట్లోకి విడుదల చేయనున్నారన్నారు. ఈ మేతలో మొక్కజొన్న కండెలు, గడ్డి కలిపి దాణాగా తయారు చేసి పశువులకు పెడుతున్నారని,దీనికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తుందన్నారు. ఇవన్నీ కూడా టీడీపీ నాయకులు దోచుకుంటున్నారని విమర్శించారు. కోడెల శివప్రసాద్ కూతురు కోడెల విజయలక్ష్మీ వీటిని కొనుగోలు చేసి సైలేజ్ యూనిట్లు పెట్టి కేంద్రం నుంచి వస్తున్న సబ్సిడీని కాజేస్తున్నారని మండిపడ్డారు. పశువులు ఈ సైలేజ్ను కనీసం ముట్టుకోవడం లేదని, ఈ పథకం పేరుతో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బలవంతంగా డీఆర్డీఏ డిపార్టుమెంట్కు అప్పగించి గోపాలమిత్రల ద్వారా మీటింగ్లు పెట్టి వీటిని భారీ ఎత్తున వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తున్నారన్నారు. కోడెల కుటుంబం మామూలుగా దోచుకోవడం లేదని, డిపార్టుమెంట్ల ప్రకారం పంచుకొని దోచుకుంటున్నారని ఆరోపించారు. మందుల మాన్యుఫక్చరింగ్ కోడెల కుమార్తె తీసుకున్నారని రిటైల్ షాపులకు సెఫ్ మెడికల్స్ అమ్మాలని ఆదేశాలు ఇస్తున్నారన్నారు. వెటర్నీ మెడికల్స్ కూడా బలవంతంగా ఆమ్మిస్తున్నారన్నారు. కోడెల కుమారుడు ఎన్ఎస్పీ కాంట్రాక్ట్లు,ఆర్అండ్బీ కాంట్రాక్టులు, రైల్వే కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. కోడెల కుటుంబం ఆధ్వర్యంలో నరసరావుపేట, సత్తెనపల్లె నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందని ఆయన తెలిపారు. పశుగ్రాసం కొనుగోలు, ఎన్ఎస్పీ పనుల్లో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండు చేశారు. పశుగ్రాసం కుంభకోణంలో లాల్లుప్రసాద్యాదవ్ ఎలాగైతే జీవిత ఖైదు అనుభవిస్తున్నారో, అదేవిధంగా కోడెల కుటుంబంపై కూడా సీబీఐ విచారణ చేపట్టాలని, దోషులను తప్పకుండా శిక్షించాలని ఆయన డిమాండు చేశారు.