- డంపింగ్ యార్డు ఎత్తివేతకు అంగీకారం
- మూడు నెలల్లో తొలగిస్తామన్న కలెక్టర్
- దీక్ష విరమించిన ఎమ్మెల్యే
- చెవిరెడ్డి పోరాట ఫలితంపై స్థానికుల హర్షం
చిత్తూరుః చంద్రగిరి వైయస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీక్షతో ప్రభుత్వం దిగివచ్చింది. సి. రామాపురం గ్రామంలో డంపింగ్ యార్డును మూడు నెలల్లో ఎత్తేస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో, చెవిరెడ్డి దీక్ష విరమించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యే చెవిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. భాస్కర్ రెడ్డి పోరాట ఫలితంపై హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో వేలాది మంది ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిన డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్తూరు సబ్ జైళ్లోనూ చెవిరెడ్డి దీక్షను కొనసాగించారు. తన ప్రాణం పోయినా సరే నియోజకవర్గ ప్రజల సమస్యను పరిష్కరించాల్సిందేనని పట్టుబట్టారు.
చిత్తూరు సబ్జైలులో దీక్ష చేసిన ఆయన అక్కడ నుంచి బెయిల్పై విడుదల అయ్యాక తిరుపతి రూరల్ మండలం కేసీపేటలో దీక్షను కొనసాగించారు. ఐదు రోజుల పాటు ఎమ్మెల్యే ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్రమేణ క్షిణించింది. బుధవారం రాత్రి దీక్ష శిబిరంలో ప్రభుత్వ వైద్యులు కాజల్ ఆనంద్ ఎమ్మెల్యేకు పరీక్షలు నిర్వహించారు. బీపీ 106/67కు, షుగర్ లెవల్ 79కి పడిపోయినట్లు గుర్తించారు. దీక్ష ఇలాగే కొనసాగిస్తే ఆరోగ్యం మరింత క్షిణించే ప్రమాదం ఉందని, కోమాలోకి పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. అంతకు ముందు ఎమ్మెల్యేకు ఆయన వ్యక్తిగత వైద్యులు హరినాథ్రెడ్డి, కృష్ణప్రశాంతి వైద్య పరీక్షలు చేశారు. చెవిరెడ్డిని అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.