విజయవాడ: చంద్రబాబునాయుడు ఏ పని చేసినా దాంట్లో రాజకీయ దురుద్దేశం ఉంటుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో కూడా అదే జరిగిందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ఏడాది క్రితం జీఎస్ఎల్ సంస్థ ముందుకు వచ్చిందని, అప్పుడు ఆస్తులు అప్పుల కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పారన్నారు. కానీ ఇప్పుడు రూ. 2500 కోట్లు ఆస్తుల విలువ.. అప్పులు రూ. 10 వేల కోట్లు అని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు అగ్రిగోల్డ్బాధితులను ఆదుకుంటామని, నిరుత్సాహాపడాల్సిన పనిలేదని చెప్పారన్నారు. ఆస్తులు అప్పులకంటే రెండింతలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. అదే సభలో ప్రతిపక్షనేత వైయస్ జగన్ రూ. 11 వందల కోట్లు విడుదల చేసి ఆస్తులను ప్రభుత్వమే జప్తు చేసుకోవాలని సూచించారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు వైయస్ఆర్ సీపీ పోరాడుతుందని, ముందుకు వచ్చే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని భవిష్యత్తు కార్యచరణ రూపొందిస్తామన్నారు.