కొవ్వూరు: గతంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానాన్ని మించిన జన ప్రభంజనం ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు తరలివస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పాదయాత్ర ద్వారా వస్తున్న జననేతను ప్రజలంతా అక్కున చేర్చుకుంటున్నారన్నారు. కొవ్వూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కాపాడడంలో విఫలమై ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఎంపీలమంతా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామాలు చేశామన్నారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు ఇప్పుడు వైయస్ఆర్ సీపీపై బురదజల్లడం నీచమన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ప్రజలను మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీతో ధైర్యంగా అవిశ్వాసం పెట్టిన ఏకైక పార్టీ వైయస్ఆర్ సీపీ అని, చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. స్వార్థప్రయోజనాల కోసం ప్రజల కోసం పోరాడే పార్టీపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు.