ఏనాడైనా కేంద్రాన్ని నిలదీశారా?

29 Jun, 2018 13:13 IST
ఓట్ల దీక్షలు మాని చిత్తశుద్ధితో పోరాడండి
ఉక్కు పరిశ్రమ సాధనకు ప్రభుత్వం ముందుకురావాలి
వైయస్‌ఆర్‌ జిల్లా: నాలుగేళ్లుగా చంద్రబాబు సర్కార్‌ ఏ ఒక్కసారైనా ఉక్కు పరిశ్రమ గురించి కేంద్రాన్ని నిలదీసిన దాఖళాలు లేవని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. కడప ఉక్కు– ఆంధ్రుల హక్కు నినాదంతో వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు పులివెందులలో వైయస్‌ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి వ్యాపారి బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారన్నారు. అదే విధంగా యువత బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారన్నారు. దీన్ని బట్టి జిల్లాలో నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉందో అర్థం అవుతుందన్నారు. నాలుగు సంవత్సరాలుగా బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమ నిర్మించకుండా తాత్సారం చేస్తూ ఆంధ్రరాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కళ్లు తెరిచి ఓట్ల కోసం దీక్షలు కాకుండా చిత్తశుద్ధితో పోరాటం చేయాలన్నారు. సత్వరమే ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసి పనులు జరిపించేలా ముందుకు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.