గుంటూరు: పోలింగ్ బూత్ లెవల్ నుంచి కష్టపడి పనిచేస్తే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని ప్రత్యేక హోదా సాధనకు ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైయస్ఆర్సీపీ నాయకడు మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలో మూడో రోజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ శిక్షణా తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మేకపాటి మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబుని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. టీడీపీ, బీజేపీలు తమ కుంభకోణాల విషయంలో సవాల్ చేసుకుంటున్నాయని, రెండు పార్టీలు వాటిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీలో సంక్షేమ పథకాలు పూర్తిగా కుంటుపడ్డాయని ఆయన మండిపడ్డారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వైయస్ జగన్ పాదయాత్ర ఒక అద్భుతమని, ప్రజల కోసం కష్టపడుతున్న ఇలాంటి నాయకుడు దొరకడం మన అదృష్టమని పేర్కొన్నారు. కార్యక్రమానికి వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తఫా, మల్లాది విష్ణు, రావి వెంకటరమణ, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, సుచరిత, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, బాలశౌరి, కృష్ణదేవరాయలు తదితరులు హాజరయ్యారు.