విశాఖ: వైయస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెడతామని వైయస్ జగన్ప్రకటించడం పట్ల ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి హర్షం వ్యక్తం చేశారు. విశాఖలోని వంచన వ్యతిరేక దీక్షలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ..ఎన్టీఆర్ పేరు పెడతానని వైయస్ జగన్ అనడం సంతోషకరమన్నారు. కన్న కొడుకులు, కట్టుకున్న అల్లుడు చంద్రబాబు చేయలేని పని వైయస్ జగన్ చేస్తామనడం ఆనందంగా ఉందన్నారు. కొడుకులు తండ్రి ధర్మాన్ని నెరవేర్చుతారని, అయితే ఎన్టీఆర్ కొడుకులు ఆ పని చేయలేకపోయారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కొడుకు వైయస్ జగన్ ఎన్టీఆర్పై ఉన్న అభిమానంతో ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని ప్రకటించడం ఆనందంతో గుండె పొంగిపోతుందన్నారు. వయసు చిన్నదే అయినా పెద్దల పట్ల వైయస్ జగన్కు ఉన్న అభిమానం చాలా గొప్పదన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ బొమ్మకు దండలేస్తు ఓట్లు కొల్లగొడుతున్నారే తప్ప ఏ నాడు ఆయనకు గౌరవం ఇవ్వలేదన్నారు. మహానుభావుడి పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలన్న ఆలోచన టీడీపీ నేతలకు రాకపోవడం బాధాకరమన్నారు. వైయస్ జగన్ను చూసి నేర్చుకోవాలని ఆమె సూచించారు.
ప్రత్యేక హోదాపై టీడీపీ పోరాటంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు.