అనంతపురం: సమష్టి కృషితో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేద్దామని వైయస్ఆర్సీపీ జిల్లా పరిశీలకుడు వైయస్ కొండారెడ్డి, రాయదుర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలోని గొల్లపల్లిలో పార్టీ మండల కన్వీనర్ గౌని కాంతారెడ్డి అధ్యక్షతన బూత్ కన్వీనర్లు, గ్రామ కమిటీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాలుగేళ్లపాటు హోదా సంజీవిని కాదంటూ మాట్లాడి హోదా కోసం సాగిన ప్రజాపోరును నియంతలా అణచివేశారన్నారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి వైయస్ఆర్సీపీ రాజీలేని పోరాటం చేస్తోందని, ఈ విషయం ప్రజలకు బాగ తెలుసని చెప్పారు. ప్రతి బూత్లోనూ పార్టీ పటిష్టంగా ఉండేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రధానంగా పార్టీకి కార్యకర్తలే కొండంత బలమని, వారు పడుతున్న కష్టాలను ఎన్నటికీ మరచిపోలేమని చెప్పారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యకు పరిష్కారం దిశగా రాజీ లేని పోరాటం చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ.. వైయస్ జగన్ అంతకంటే రెట్టింపు స్థాయిలో చేస్తాడని చెప్పాలన్నారు.