పశ్చిమ గోదావరి: వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైయస్ఆర్సీపీ నాయకులు కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకు నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో కారుమూరి నాగేశ్వరరావు పర్యటించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలకు ఎగువ నుంచి గోదావరి నదిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతాలైన కుంట, కొయిదా, పేరూరి, భధ్రాచలం ప్రాంతాలలో కురుస్తున్న భారీవర్షాలతో ప్రాణహిత, శబరి, పెనుగంగ, మంజీర ఉప నదుల నుంచి గోదావరి నదిలోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. గోదావరి ఉధృతి క్రమక్రమంగా పెరగడంతో ధవళేశ్వరం హెడ్వర్క్స్ అధికారులు సోమవారం ఉదయం 11.30 గంటలకు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అయితే ముంపు ప్రాంతాలకు అధికారులు రావడం లేదని, పునరావాస చర్యలు కరువయ్యాయని ఆయన మండిపడ్డారు. బాధితులను ఆదుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.