గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి తెలుగు దేశం పార్టీనే కారణమని, ఇందులో ప్రథమ ముద్దాయి అధికార పార్టీనే అని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. బుధవారం గుంటూరులో హోదా సాధన కమిటీ సభ్యులు వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా పార్ధసారధి మీడియాతో మాట్లాడుతూ..ప్రత్యేక హోదా సాధనకు వైయస్ఆర్సీపీ చేస్తున్న పోరాటానికి అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తుందన్నారు. ఈ క్రమంలోనే హోదా సాధన కమిటీ నాయకులు వైయస్ జగన్ను కలిశారన్నారు. ప్రత్యేక హోదా సాదనకు వైయస్ జగన్ మొదటి నుంచి పోరాటం చేస్తున్నారని సాధన కమిటీ సభ్యులు చెప్పినట్లు చెప్పారు. హోదా సాధనకు అందరం కలిసి పోరాటం చేద్దామని వైయస్ జగన్ను కోరినట్లు వివరించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్ సాక్షిగా హమీ ఇచ్నిన అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగార్చాయన్నారు. హోదా కోసం వైయస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని, పార్లమెంట్ సమావేశాల్లో హోదాపై తేల్చకపోతే వైయస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని, ఆ తరువాత ఆమరణ నిరాహార దీక్షలు చేపడుతారని చెప్పారు. వైయస్ఆర్సీపీ పోరాటానికి అందరూ మద్దతు తెలపాలని పార్థసారధి కోరారు.