తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేసుల భయం పట్టుకుందని, అందుకే మళ్లీ ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు మరోసారి కుట్రలకు పాల్పడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కేసుల భయంతో వణికిపోతున్న చంద్రబాబు మళ్లీ బీజేపీకి దగ్గరవుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుతో రాజీకీ బీజేపీ కీలకనేత రాయబారం నడుపుతున్నట్టు అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారన్నారు. రంగులు మార్చడంలో చంద్రబాబు ఊసరవెల్లికి తాత అయ్యారన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని, అందువల్లే రాష్ట్రానికి హోదా రావడం లేదని అన్నారు. ఇప్పుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో తన ఎంపీలచే నాటకాలు ఆడిస్తున్నాడని.. హోదా కోసం వీరోచిత పోరాటం చేస్తోంది కేవలం వైయస్ జగన్ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. హోదా సాధనకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తుందని వివరించారు.