కోడెల వ్యవహార శైలిపై ఫిర్యాదు

13 Dec, 2015 23:01 IST

గుంటూరు: నరసారావుపేట శతాబ్ది ఉత్సవాలలో టీడీపీ ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించలేదని నరసారావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, వైఎస్ఆర్‑సీపీ గుంటూరు జిల్లా కన్వినర్ మర్రి రాజశేఖర్ అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు జిల్లా నేతలు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‑ను కలిశారు. రెండు రోజులుగా నరసరావు పేట శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కానీ, వీటిని ప్రభుత్వ విధానాల ప్రకారం కాకుండా పక్క నియోజక వర్గమైన సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు చేతుల మీదుగా నిర్వహిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఇదంతా తన కుమారుడిని జనానికి పరిచయం చేసేందుకే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ ఉత్సవాలను చేస్తున్నారని వైఎస్ఆర్‑సీపీ నేతలు గవర్నర్ నరసింహన్ కు వివరించారు. సత్తెనపల్లిలో గెలిచిన కోడెల.. నరసారావుపేటలో పెత్తనం చేయడం ఏంటి అని గవర్నర్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.