గడప గడపకూ వైఎస్ పథకాలు

6 Dec, 2015 08:23 IST


 హైదరాబాద్ పరిధిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఆ పథకాలే ఇప్పుడు వైఎస్సార్‌సీపీకి శ్రీరామరక్ష అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి శివకుమార్ అన్నారు.  శనివారం వనస్థలిపురం పనామా చౌరస్తాలోని బొమ్మిడి లలితా గార్డెన్‌లో జరిగిన వైఎస్సార్‌సీపీ ఎల్‌బీనగర్ నియోజకవర్గం సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేయాలని ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

జీహెచ్‌ఎంసీని వైఎస్సార్ ఏర్పాటు చేశారని, మెట్రోరైలు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు తదితరాలు ఆయన హయాంలోనే రూపుదిద్దుకున్నాయన్నారు. 2009 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కనీసం పోటీలో కూడా లేని టీఆర్‌ఎస్ నేడు అధికారబలంతో అడ్డదారుల్లో మేయర్ పీఠం చేజిక్కించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతు పార్టీలో పనిచేస్తున్న అందరికీ గుర్తింపు ఉంటుందని, కార్పొరేటర్లుగా పోటీ చేయదలచిన వారు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకోవాలని సూచించారు. పార్టీ 150 డివిజన్లలో పోటీ చేస్తుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు జి.సురేష్‌రెడ్డి నాయకులు రాఘవనాయుడు, వెంకటకృష్ణ తదితరులు మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సూరజ్ యజ్దాని, సంయుక్త కార్యదర్శి దుబ్బాక గోపాల్‌రెడ్ది, మైనార్టీ నాయకులు మాసూమ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.