వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఉచిత తాగునీరు
కాజ(మంగళగిరి): వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు మంచినీరు పంపిణీ చేయడం అభినందనీయమని పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు అన్నారు. మండలంలోని కాజ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలకు నీరు సరఫరా చేసేందుకు రెండు ట్రాక్టర్లతో ఏర్పాటు చేసి ట్యాంకర్లను మంగళవారం పార్టీ మండల కన్వినర్ శ్రీనివాసరెడ్డితో కలిసి మోహనరావు ప్రారంభించారు. వేసవికాలం కావడంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలలో బోర్లకు నీరందకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించిన పార్టీ రెండు ట్యాంకర్లను ఏర్పాటు చేసి రెండు నెలల పాటు ఆయా కాలనీల్లో నీటిని సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమానికి హాజరైన పార్టీ నాయకులు మాట్లాడుతూ వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో తాగునీటి సరఫరా ఏర్పాటు చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో గ్రామంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. కాజ గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆదర్శంగా తీసుకుని మిగిలిన గ్రామాలలోను సేవా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని మోహన్రావు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షడు అర్ల రామయ్య, ఎంపీటీసీ చిలకలపూడి భాస్కర్, గ్రామ పార్టీ నాయకులు దొంతా వెంకట్రావు, మారెళ్ళ సత్యమారెడ్డి, అన్నపురెడ్డి, సింహాద్రి భాస్కరరెడ్డి, పాలేటి కృష్ణారావు, మందా విజయ్బాబు తదితరులు పాల్గొన్నారు.