విజయవాడ సబ్ కలెక్టరెట్ ఎదుట వైయస్సార్సీపీ ధర్నా
14 Feb, 2017 16:05 IST
మినుము రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
విజయవాడ: మినుము రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి మండిపడ్డారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో మినుము పంట కోల్పొయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ విజయవాడలో వైయస్ఆర్కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. పార్టీ నేతలు, వందలాది మంది రైతులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇదే ప్రాంతాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సందర్శించి మినుము రైతుల కష్టాలు తెలుసుకున్నారు. అయినా ప్రభుత్వం ప్రభుత్వం సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులకు పరిహారం అందిచడంలో విఫలమైందని పార్టీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి మాట్లాడుతూ..మినుము రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఒకపక్కా మినుము రైతు పూర్తిగా అప్పుల ఊబిలో మునిగిపోతే మరోవైపు మాటలతో ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో మినుము కోతలు ప్రారంభమవుతున్నాయని, చాలా మంది రైతులు పంటను కోయడం కూడా కష్టమని భావించి గొ్రరెలు, మేకలు, పశువులను మేపేందుకు వదిలిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఎన్యుమరేషన్ ప్రారంభించి నష్టపోయిన రైతుల వివరాలు నమోదు చేసి, ఎకరానికి రూ.15 వేలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.