విజయవాడ : విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం ఘటనను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. చంద్రబాబు మొదటి నుంచి దళిత వ్యతిరేకేనని ఆయన మండిపడ్డారు. బుధవారం మేరుగ నాగార్జున విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ నేతలు, కార్యకర్తలు దళితులపై ఎటువంటి ఘాతుకాలకు పాల్పడినా ప్రభుత్వం చర్యలు తీసుకోదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. దళిత మహిళను వివస్త్రను చేసిన ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.